ఇంకా కేంద్రం బాకీ రూ.2 వేల కోట్లు
15వ ఆర్థిక సంఘం పెండింగ్ నిధులను విడుదల చేయండి : కేంద్రానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలోని గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నుంచి మూడో విడత కింద రూ.387.53 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకూ రూ.1034.42 కోట్లు విడుదల చేసినట్టయింది. ఇంకా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.2 వేల కోట్లు బాకీ పడ్డది. గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదనే కారణంతో పెండింగ్లో పెట్టిన నిధులను కేంద్రం క్రమంగా విడుదల చేస్తున్నది. ఇప్పటివరకు కేంద్ర విడుదల చేసిన నిధులను గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు, పెండింగ్ బిల్లుల చెల్లింపులకు వెచ్చించాలని పంచాయతీరాజ్ శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పెండింగ్లో ఉన్న రూ.2 వేల కోట్లను త్వరలో విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) విజ్ఞప్తి చేశారు.



