Tuesday, October 14, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుహాస్టళ్లకు రూ.60 కోట్లు

హాస్టళ్లకు రూ.60 కోట్లు

- Advertisement -

భోజనం, జీతాలు, సదుపాయాలు, మరమ్మతులకు కేటాయింపు
విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బందికి ఫేషియల్‌ రికగ్నిషన్‌
వైద్య కళాశాలలతో హాస్టళ్లకు లింక్‌
విద్యార్థులకు వైద్య పరీక్షలు
ఆహార నాణ్యత తనిఖీ
సంక్షేమ వసతి గహాల సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఎస్సీ , ఎస్టీ ,బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గహాల్లో అత్యవసర పనులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి రూ.60 కోట్లు కేటాయించింది. ఈ నిధులను హాస్టళ్లలో డైట్‌ చార్జీలు , తాత్కాలిక సిబ్బంది జీతాల విడుదల, హాస్టళ్లలో మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వాటిని వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ హాస్టళ్లకు కేటాయిం చిన నిధుల చెక్కులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆయా శాఖల సీనియర్‌ అధికారులకు అందజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గృహాలు, విద్యా సంస్థలపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలనీ, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, బోధన , బోధనేతర సిబ్బంది ముఖ గుర్తింపుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. పూర్తి స్థాయి డేటా, జవాబుదారీతనం ఉండాలని చెప్పారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్య తను తెలుసుకునేందుకు యాప్‌ను ఉపయోగిం చాలని సూచించారు. విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

దాంతో వారికి లభించే కేలరీలను తెలుసుకోవాలని ఆదేశించారు. హాస్టల్‌ విద్యార్థులకు అందించే యూనిఫారాలు, పుస్తకాలు సకాలంలో అందేలా సీనియర్‌ అధికారులు చూసుకోవాలనీ, ఈ విషయాన్ని ఉన్నతాధికారులు నిర్దారించాలని సీఎం సూచించారు. హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వసతులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్‌బోర్డ్‌లో అప్‌లోడ్‌ చేయాలని సీఎం ఆదేశించారు. హాస్టళ్లలోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు వైద్య కళాశాలలు , కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు , ఏరియా ఆసుపత్రులను హాస్టళ్లతో అనుసంధానించాలని సూచించారు. హాస్టళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించాలనీ, అత్యవసర సమయాల్లో వైద్యులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు , అదనపు కలెక్టర్లు తరచుగా హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లకు స్కాలర్‌షిప్‌లు , సిబ్బంది జీతాలు , డైట్‌ చార్జీలు , నిర్మాణంతోపాటు ఇతర ఖర్చులు, బకాయిల చెల్లింపు, హాస్టళ్ల నిర్వహణకు అయ్యే నెలవారీ వ్యయం, బకాయిల చెల్లింపుకు అవసరమైన మొత్తానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు, సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌లను ముఖ్యమంత్రి ఆదేశించారు.

హాస్టళ్ల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులను సమీకరించాలని, వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంట్‌ను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.24 గంటలూ ఆన్‌లైన్‌లో వైద్యులు అందుబాటులో ఉండేలా హాట్‌లైన్‌ ఏర్పాటు చేయాలనీ, పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఎడ్‌ టెక్‌ను ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. హాస్టల్‌ విద్యార్థులకు అందించే సేవలను సోషల్‌ మీడియా ద్వారా తెలియజేయాలని, ఉద్దేశపూర్వకంగా చేసే తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని సూచించారు. వీటన్నింటికీ అవసరమైన యాప్‌లను రూపొందించాలని ఆదేశించారు.సమీక్షకు ముందు సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ హాస్టళ్లలోని పరిస్థితులపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సమీక్షలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి వి.శేషాద్రి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగుల శాఖల అధికారులు జ్యోతి బుద్ధప్రకాష్‌ , బి. షఫియుల్లా, అనితా రామచంద్రన్‌, క్షితిజ, నిర్మల, క్రాంతి, వెస్లీ, కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -