టాప్ 50 కంపెనీల సాయం
‘పెర్పెచువల్ క్యాపిటల్ హురున్ ఇంపాక్ట్ 50’ నివేదిక
నవతెలంగాణ – హైదరాబాద్
గడిచిన ఏడాదిలో దేశంలోని టాప్ 50 కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా రూ.8,000 కోట్లను వెచ్చించాయని ‘పెర్పెచువల్ క్యాపిటల్ హురున్ ఇండియా ఇంపాక్ట్ 50 – 2026’ నివేదిక వెల్లడించింది. ఈ సేవల్లో హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) 53.9 పాయింట్లతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొంది. 67,217 మంది మహిళా ఉద్యోగులతో మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన హెచ్సీఎల్ టెక్నాలజీస్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, డాబర్ ఇండియా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ సేవా కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా 20 కోట్లకు పైగా ప్రజలు లబ్ధి పొందగా, 48 కంపెనీలు పర్యావరణ పరిరక్షణను తమ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి.
మొత్తం రూ. 48.5 లక్షల కోట్ల ఆదాయం ఆర్జించాయని తెలిపింది. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన టాప్ 50 కంపెనీలను ఈ నివేదికలో పొందుపరిచామని పెర్పెచువల్ క్యాపిటల్ పార్టనర్ అన్విత ప్రశాంత్ తెలిపారు. 25 కంపెనీలు ఇప్పటికే కార్బన్ న్యూట్రాలిటీ దిశగా బలమైన అడుగులు వేశాయన్నారు. ఇది కొత్త ఆవిష్కర్తలకు గొప్ప ఊతమిస్తుందని ఆ సంస్థ మరో భాగస్వామి ప్రణవ్ ప్రశాంత్ పేర్కొన్నారు. కంపెనీలు లాభాలతో పాటు పర్యావరణానికి ప్రాధాన్యతను ఇస్తున్నాయని హురున్ ఇండియా వ్యవస్థాపకుడు అనాస్ రెహమాన్ జునైద్ పేర్కొన్నారు.
సీఎస్ఆర్కు రూ.8వేల కోట్ల వ్యయం
- Advertisement -
- Advertisement -



