సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెంచిన ఆర్టీసీ చార్జీలను ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాదు-సికింద్రాబాదు జంట నగరాల్లో ఆర్టీసీ చార్జీలు మొదటి మూడు స్టేజీలకు రూ.5లు, నాలుగో స్టేజీకి రూ.10ల చొప్పున పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయతో సామాన్య ప్రజలకు తీవ్ర భారమవుతుందని పేర్కొన్నారు. కొత్త డిపోలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రూ.392 కోట్లు ఖర్చవుతుందనీ, అందుకే చార్జీలను పెంచుతున్నామని, ప్రజలు సహకరించాలని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాదులో ఎలక్ట్రికల్ బస్సు చార్జీలను, బస్సు పాస్ చార్జీలను భారీగా పెంచిందని గుర్తుచేశారు. పండుగల పేరుతో ప్రజల నుంచి 50 శాతం అదనంగా వసూలు చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా ప్రజలపై మరోసారి అదనంగా భారాలు వేయడం సమంజసం కాదని హితవు పలికారు.
ఆర్టీసీలోనే కార్గో సేవలు కొనసాగించాలి
కార్గో సర్వీసును ప్రయివేటీకరించడానికి ప్రయత్నిస్తున్నట్టు వార్తలొస్తున్నాయనీ, ఆర్టీసీలోనే ఈ సేవలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రయివేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవడంతో పాటు, ఈ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని కోరారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని జాన్వెస్లీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.