డాలర్ @92.16
ముంబయి : అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత కరెన్సీని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ సంక్షోభంతో రూపాయి విలువ పాతాళానికి పడిపోయింది. బుధవారం డాలర్తో రూపాయి మారకం విలువ ఏకంగా 67 పైసలు క్షీణించి.. 92.16కు పడిపోయి.. చరిత్రలోనే ఆల్టైం కనిష్ట స్థాయిని చవి చూసింది. అంతకుముందు సోమవారం నాడు 91.49 వద్ద ముగిసిన రూపాయి విలువ హోలీ సెలవుల తర్వాత మార్కెట్ పున్ణప్రారంభమైన తొలిరోజే భారీ పతనాన్ని చవిచూసింది. బుధవారం ఇంట్రాడేలో ఒకానొక దశలో రూపాయి విలువ 92.35 స్థాయికి కూడా పడిపోవడం తీవ్ర ఆందోళకర అంశం.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 82 డాలర్లకు చేరడంతో.. చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ లాంటి దేశాలకు ఇది అదనపు భారంగా మారింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే డాలర్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో డాలర్ ఇండెక్స్ 98 స్థాయిని దాటి బలోపేతం కావడం రూపాయిపై ఒత్తిడి పెంచింది. దేశీయ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగడం, విదేశీ నిధులు నిరంతరం తరలిపోవడం రూపాయి పతనానికి మరింత ఆజ్యం పోశాయి. ఒకవేళ హొర్ముజ్ జలసంధి గుండా ఇంధన రవాణాకు ఆటంకం కలిగితే రూపాయి విలువ మరింత క్షీణించి భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పాతాళానికి రూపాయి
- Advertisement -
- Advertisement -



