‘ముకెేశ్ కా సాత్..రిలయన్స్ కా వికాస్’ ఇదీ మోడీ సర్కార్ తీరు
నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి
బ్లూమ్బర్గ్ సంచలన కథనం
ప్రభుత్వ రంగ సంస్థలపై మాత్రమే ట్రంప్ ఆంక్షలు
వడ్డించే వాడు మనవాడైతే..ఏ మూల కూర్చున్నా పంచభక్ష పరమాన్నాలు వస్తాయన్న నానుడి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి, ప్రధాని మోడీ సరిగ్గా సరిపోతుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ తియ్యగా మాట్లాడే దేశ ప్రధాని..అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే చర్చ నడుస్తోంది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించు కోవటానికి రిలయన్స్కు దొడ్డిదారిలో రష్యా చమురు సరఫరా చేస్తూ ముకేశ్ అంబానీతో మోడీ సర్కార్ మిలాఖత్ అయ్యింది. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలను కాదని ముకేశ్ కోసం ఎంతకైనా తెగిస్తామనేలా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సంచలనంగా మారింది.
న్యూఢిల్లీ : ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండిస్టీస్కు రష్యా నుంచి దొడ్డిదారి లో చమురు దిగుమతికి మోడీ సర్కార్ సహకరిస్తోంది. అదే ప్రభుత్వ రంగ చమురు సంస్థలపై మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలను కేంద్రం అమలు చేస్తోంది. యూఎస్ ఆంక్షలతో కొద్దికాలం పాటు రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసిన రిలయ న్స్ ఇండిస్టీస్ తాజాగా మళ్లీ దిగుమతులు ప్రారంభించినట్టు బ్లూమ్బర్గ్ సంచలన కథనాన్ని ప్రచురించింది. రష్యా ముడి చమురుతో నిండిన మూడు భారీ నౌకలు ప్రస్తుతం గుజరాత్ తీరంలోని రిలయన్స్ రిఫైనరీ వైపు వస్తున్నాయని నివేదించింది. బ్లూమ్బర్గ్ రిపోర్ట్ ప్రకారం.. రష్యా యూరల్స్ రకానికి చెందిన దాదాపు 22 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో పలు నౌకలు భారత తీరానికి చేరుకుంటు న్నాయి. కెప్లర్ అనే డేటా సంస్థ సమాచారం ప్రకారం.. ఈ చమురు జనవరి తొలి వారంలోనే జామ్నగర్ రిఫైనరీకి చేరుకోవాల్సి ఉంది. ఈ చమురును విదేశాలకు ఎగుమతి చేయడానికి కాకుండా భారత దేశీయ అవసరాల కోసం ఇంధనంగా మార్చడానికి రిలయన్స్ ఉపయోగించాలని భావించింది. గతంలో రష్యా నుంచి రిలయన్స్కు అత్యధికంగా చమురు సరఫరా చేసే రోస్నెఫ్ట్, లూకోయిల్ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో రిలయన్స్ ఆ దేశం నుంచి కొనుగోళ్లు నిలిపివేసింది. కాగా..ఇప్పుడు ఇతర మధ్యవర్తుల ద్వారా రిలయన్స్ చమురు ను సేకరించి.. అడ్డదారిలో భారత్కు తీసుకొస్తోంది. రష్యాతో చమురు వ్యాపారం కొనసాగిస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై 50 శాతం టారిఫ్లను అమలు చేస్తోన్న సమయంలో రిలయన్స్ కొనుగో ళ్లు జరపడం గమనార్హం.
పలు రష్యన్ కంపెనీలపై ఉన్న యూఎస్ ఆంక్షలతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు రష్యా నుంచి చమురు దిగుమతులను దాదాపు నిలిపివేశాయి. మరోవైపు రిలయన్స్కు భారీ లాభాలను చేకూర్చడానికి అక్రమ పద్ధతిలో అనుమతులు జారీ చేయడంతో ‘ముఖేశ్ కా సాత్, రిలయన్స్కా వికాస్’ అన్నట్టుగా మోడీ సర్కార్ తీరు ఉందని నిపుణులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం రిలయన్స్కు వస్తున్న చమురు నిల్వలను అల్ఘాఫ్ మెరైన్, రెడ్వుడ్ గ్లోబల్ వంటి సంస్థలు సరఫరా చేస్తున్నా యని బ్లూమ్బర్గ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఈ వార్తల్లో నిజం లేదని.. తాము జనవరిలో రష్యా నుంచి ఎలాం టి చమురును దిగుమతి చేసుకోలేదని రిలయన్స్ ఇండిస్టీస్ పేర్కొంది. ప్రపంచంలోనే అతిపె ద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో జామ్నగర్ రిఫైనరీ ఒకటి. భారత ఇంధన సరఫరా, ఎగుమతుల్లో ఈ రిఫైనరీ కీలక భాగస్వామ్యం కలిగి ఉంది. డిసెంబర్లో జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్కు రష్యా నుంచి రోజుకు 2.70 లక్షల బ్యారెల్స్ చమురు దిగుమతి అయ్యింది. ఆ సంస్థ మొత్తం దిగుమతుల్లో ఇది 20 శాతంగా ఉంది.
రూ.లక్ష కోట్లు ఆవిరి.. ఆంక్షల మధ్య రిలయన్స్
అడ్డదారిలో రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుందన్న రిపోర్ట్లతో మంగళవారం ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్చ్సేంజీలో ఇంట్రాడేలో రిలయన్స్ షేర్ 5 శాతం పతనమై రూ.1,497.05ను తాకింది. తుదకు 4.39 శాతం లేదా రూ.69.20 నష్టంతో రూ.1508.90 వద్ద ముగిసింది. ఒక దశలో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్లు ఆవిరయ్యింది. తుదకు రూ.94,389 కోట్లు విలువ హరించుకుపోయి.. రూ.20.40 లక్షలకు పరిమితమయ్యింది. గడిచిన తొమ్మిది మాసాల్లో ఇదే అత్యధిక పతనం కావడం విశేషం.



