ముంబయి : భారత యువ క్రికెటర్, చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇంగ్లీశ్ సమ్మర్ సీజన్లో కౌంటీ క్రికెట్లో ఆడనున్నాడు. భారత జట్టు ఐదు టెస్టుల టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్లో పర్యటిస్తుండగా.. ఈ సమయంలో రుతురాజ్ గైక్వాడ్ కౌంటీల్లో కనిపించనున్నాడు. 28 ఏండ్ల గైక్వాడ్.. యార్క్షైర్తో ఐదు కౌంటీ చాంపియన్షిప్ మ్యాచుల్లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కౌంటీ మ్యాచుల అనంతరం మెట్రో బ్యాంక్ వన్డే కప్లోనూ రుతురాజ్ ఆడనున్నాడు. భారత్ తరఫున ఆరు వన్డేలు, 23 టీ20లు ఆడిన రుతురాజ్ ప్రస్తుతం భారత్-ఏ తరఫున ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఏడు సెంచరీలతో 41.77 సగటు సాధించిన రుతురాజ్.. లిస్ట్-ఏలో 16 శతకాలతో 56.15 సగటుతో పరుగులు రాబట్టాడు. కౌంటీల్లో ఆడుతూ.. భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్కు పిలుపు వస్తే సిద్ధంగా ఉండాలని గైక్వాడ్ భావిస్తున్నాడు!.