మొదటి విడత రూ. 3,590 కోట్లు విడుదల : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రబీ సీజన్ పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసాను ఈనెల 22న రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మొదటి విడతలో రూ. 3,590 కోట్లు విడుదల చేస్తామని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ముఖ్యకార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్తో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చర్చించారు. రైతు భరోసాను ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు. ఒక ఎకరం ఉన్న రైతులకు తొలి విడతగా రూ. 3,590 కోట్లు ఇవ్వడం ద్వారా మొత్తం 70 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతోందని తుమ్మల పేర్కొన్నారు. మరో 20 రోజుల తర్వాత రెండో విడతా రూ.2,650 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా మొత్తం రైతుభరోసా నిధులు విడుదలవుతాయని పేర్కొన్నారు. మూడు విడతల్లో కలిపి మొత్తం సుమారు రూ.9 వేల కోట్లు విడుదల అవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు మంత్రి రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని పేర్కొన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు ఇచ్చిన మాటకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన గుర్తు చేశారు.
22న రైతు భరోసా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



