– నిధుల కేటాయింపులో వివక్ష
– విమానయానంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన
– ఖాళీల భర్తీలో ఉదాశీనత
న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన విమానయాన భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఈ ఏడాది మార్చిలో పార్లమెంటుకు స్టాండింగ్ కమిటీ సమర్పించిన నివేదిక అనేక లోపాలను ఎత్తిచూపింది. నిధుల కేటాయింపు విషయంలో వ్యత్యాసాలు ఉన్నాయని గుర్తించింది. భద్రతకు సంబంధించిన మౌలిక సదుపాయాల పైన, ప్రమాదాలు జరిగినప్పుడు నిర్వహించే విచారణల సమర్ధత పైన ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)లో అధిక సంఖ్యలో భర్తీ చేయాల్సిన ఖాళీలను ప్రస్తావించింది. జేడీయూ ఎంపీ సంజరు కుమార్ ఝా నేతృత్వంలోని పార్లమెంటరీ స్డాండింగ్ కమిటీ మార్చి 25న చట్టసభకు తన నివేదికను సమర్పించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో కమిటీ ప్రస్తావించిన అంశాలను, లేవనెత్తిన ప్రశ్నలను, వ్యక్తపరచిన ఆందోళనలను, అది చేసిన సిఫార్సులను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డీజీసీఏకే అధిక నిధులు
2025-26లో కీలకమైన విమానయాన సంస్థలకు నిధుల కేటాయింపులో వివక్ష చోటుచేసుకున్నదని కమిటీ తెలిపింది. బీసీఏఎస్, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)తో పోలిస్తే బడ్జెట్లో డీజీసీఏకు పెద్దపీట వేశారని గుర్తించింది. ‘2025-26 బడ్జెట్ అంచనాలలో కీలకమైన విమానయాన సంస్థలకు నిధుల కేటాయింపు విషయంలో స్పష్టమైన అసమతుల్యత కన్పిస్తోంది. మొత్తం బడ్జెట్లో దాదాపు సగ భాగాన్ని…అంటే రూ.30 కోట్లను డీజీసీఏకే కేటాయించారు’ అని చెప్పింది. నిధుల కేటాయింపులో తేడా చూపడం అంటే భద్రతాపరమైన మౌలిక సదుపాయాల కల్పనను, ప్రమాదాలకు సంబంధించిన విచారణల సమర్థతను తక్కువ చేసి చూపడమే అవుతుందని తెలిపింది. విమానయాన భద్రత విషయంలో ముప్పు పెరుగుతోందని, అంతేకాక ప్రమాదాలపై దర్యాప్తులు సంక్లిష్టమైన స్వభావాన్ని కలిగి ఉంటాయని, ఈ పరిస్థితులలో నిధుల కేటాయింపులో వ్యత్యాసం చూపడం సరికాదని స్పష్టం చేసింది.
పేరుకుపోతున్న ఖాళీలు
విమానయాన రంగాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య సిబ్బంది కొరత. ఇది భద్రతను, సేవా ప్రమాణాలను దెబ్బతీస్తుంది. కీలకమైన విమానయాన నియంత్రణ, కార్యాచరణ సంస్థలలో…ముఖ్యంగా డీజీసీఏ, బీసీఏఎస్, ఏఏఐలలో పెద్ద ఎత్తున ఖాళీలు పేరుకుపోవడంపై స్టాండింగ్ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డీజీసీఏలో మొత్తం 1,633 పోస్టులు ఉండగా వాటిలో 879 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీసీఏఎస్లో 598 పోస్టులకు గాను 208, ఏఏఐలో 19,269 మంజూరైన పోస్టులకు గాను 3,265 ఖాళీగా ఉన్నాయి. విమానయాన భద్రత, నియంత్రణ పర్యవేక్షణకు బాధ్యత వహించే డీజీసీఏలో ఖాళీలు 53 శాతానికి మించి ఉన్నాయి.
ఈ పరిణామం విమానయాన భద్రతా ప్రమాణాలను సమర్ధవంతంగా అమలు చేయగల సామర్ధ్యంపై మౌలిక ఆందోళనను రేకెత్తిస్తోందని కమిటీ తెలిపింది. విమానయాన భద్రతను చూసే బీసీఏఎస్కు మంజూరు చేసిన పోస్టులలో 35 శాతం ఖాళీగా ఉండడం గమనార్హం. ఇది విమానాశ్రయాలలో భద్రతా పర్యవేక్షణ ప్రక్రియకు ముప్పు కలిగిస్తుంది. ఇక కీలకమైన విమానాశ్రయ మౌలిక సదుపాయాలు, ఎయిర్ ట్రాఫిక్ సేవలను చూసుకునే ఏఏఐలో ఏకంగా 3,200కు పైగా ఖాళీలు ఉన్నాయి.
అంటే మంజూరు చేసిన పోస్టులలో సుమారు 17 శాతం ఖాళీగా ఉన్నాయన్న మాట. ఇది కార్యాచరణ సామర్ధ్యాన్ని, విమానాశ్రయాల విస్తరణను ప్రభావితం చేస్తుంది. విమాన ట్రాఫిక్ పెరుగుతున్న పరిస్థితులలో కీలక విభాగాలలో సిబ్బంది కొరత భద్రత, సేవా ప్రమాణాలను దెబ్బతీస్తుందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. నియంత్రణ పర్యవేక్షణ, భద్రతా చర్యల అమలు, విమానాశ్రయ కార్యకలాపాలలో రాజీ పడకుండా ఉండాలంటే నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని స్టాండింగ్ కమిటీ సూచించింది.
ఇవేం కేటాయింపులు?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు బడ్జెట్లో బీసీఏఎస్కు రూ.15 కోట్లు, ఏఏఐబీకి రూ.20 కోట్లు కేటాయించారు. దేశంలో విమానయాన మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్నాయి. 2014లో 74 విమానాశ్రయాలు ఉండగా 2022 నాటికి ఆ సంఖ్య 147కి పెరిగింది. ఈ సంఖ్యను 220కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాంటప్పుడు భద్రతా సామర్థ్యాలను పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రమాద దర్యాప్తులకూ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్వల్ప కేటాయింపులతో చేతులు దులుపుకోవడం సమర్ధనీయం కాదని స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది. డీజీసీఏ, బీసీఏఎస్లకు జరుపుతున్న కేటాయింపులను నిరంతరం మదింపు చేయాలని, వనరులను సరిగా కేటాయించినప్పుడే విమానయాన భద్రత, నియంత్రణ సామర్ధ్యం, భద్రతాపరమైన సంసిద్ధత మెరుగుపడతాయని సూచించింది.