Saturday, June 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనకిలీ విత్తనాలు, పురుగుమందుల విక్రయం

నకిలీ విత్తనాలు, పురుగుమందుల విక్రయం

- Advertisement -

– ముఠా సభ్యుల అరెస్ట్‌
-166 కిలోల నకిలీ విత్తనాలు,800 లీటర్ల గడ్డిమందు స్వాధీనం : వరంగల్‌ సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

వరంగల్‌ జిల్లాలో నకిలీ విత్తనాలు, పురుగుమందులను విక్రయిస్తున్న ముఠాలను వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌, పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం వరంగల్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ వివరాలు వెల్లడించారు. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌, పరకాల పోలీసులు, వ్యవసాయాధికారులు సంయుక్తంగా కలిసి ప్రధాన నిందితుడు పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన మాచబోయిన తిరుపతి ఇంటిపై దాడి చేసి నకిలీ, కాలంతీరిన పురుగుమందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా, ఆయనిచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో నకిలీ పురుగుమందులు తయారు చేస్తున్న గోదాముపై దాడి చేసిన పోలీసులు.. సుమారు రూ.57.44 లక్షలు విలువ చేసే నకిలీ, కాలం తీరిన పురుగు మందులను స్వాధీనం చేసుకొని జయదీప్‌ గౌతమ్‌, ఆదిత్య, కుమారస్వామిని అరెస్ట్‌ చేశారు. గీసుగొండ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఎల్కుర్తి హవేలి ప్రాంతంలో బీరెడ్డి మర్రెడ్డి ఇంటిపై దాడి చేసి ఒక కిలో నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారంతో సంగారెడ్డి జిల్లా చింతలచెరువు గ్రామానికి చెందిన తానుగుండ్ల సందీప్‌రెడ్డి, తానుగుండ్ల విజరుజోసెఫ్‌ రెడ్డి ఇండ్లపై దాడులు చేసి రూ.6.18 లక్షల విలువైన 166 కిలోల నకిలీ విత్తనాలతోపాటు 8 వందల లీటర్ల గడ్డిమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రెండు ముఠాలకు చెందిన ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.63.62 లక్షల విలువైన 166 కిలోల నకిలీ విత్తనాలు, కాలం తీరిన 800 లీటర్ల గడ్డిమందును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బీటీ- 3 పేరిట లూజుగా ఈ విత్తనాలను అమ్ముతున్నారు. నకిలీ పురుగుమందుల తయారీకి అవసరమైన సామగ్రితోపాటు 7 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్టు సీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌, పరకాల, మామునూరు ఏసీపీలు వెంకటేశ్‌, సతీష్‌బాబు, సీఐలు బాబులాల్‌, సార్ల రాజు, రంజిత్‌, ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బందిని సీపీ అభినందించి రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -