మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్లే సమ్మక్క సారక్క బ్యారేజ్ వచ్చిందని మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్ తెలిపారు. మంగళ వారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 50 ఎకరాల ముంపుకు సంబంధించి ఛత్తీస్గఢ్తో ఒప్పందం కుదిరితే ఏదో గొప్పలు సాధించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి భయపడి నాటి సీఎం చంద్రబాబు నాయుడు దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి రూ.811 కోట్లకు జీవో ఇచ్చారనీ, 2009 నాటికి ఆ ప్రాజెక్టు పూర్తి చేయలేదని గుర్తుచేశారు. రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు ఖర్చు పెట్టినా నీరు సరిగ్గా తోడలేదన్నారు.
ఇన్టెక్ వెల్ సరిగ్గా ఏర్పాటు చేయలేదనీ, 170 రోజులు తోడాల్సి ఉండగా 110 రోజులు కూడా రాలేదనీ, కాంగ్రెస్ హయాంలో 37 టీఎంసీల నీళ్లు కూడా రాలేదని తప్పుపట్టారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక దేవాదుల ప్రాజెక్టును సరిదిద్దారనీ, దాన్ని పటిష్టం చేసేందుకు 7 టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క సారక్క బ్యారేజ్ను నిర్మించారని తెలిపారు. పెండింగ్ రిజర్వాయర్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలనీ, తుమ్మిడి హట్టి దగ్గర 152 మీటర్లకు తక్కువగా బ్యారేజ్ నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకూడదని డిమాండ్ చేశారు. మేడిగడ్డకు మరమ్మత్తులు మొదలు పెట్టి అందుబాటులోకి తేవాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ,మాజీ ఎమ్మెల్యేలు డి.వినరు భాస్కర్, డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
కేసీఆర్ వల్లే సమ్మక్క సారక్క బ్యారేజ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES