Sunday, July 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబోల్సొనారోపై ఆంక్షలు

బోల్సొనారోపై ఆంక్షలు

- Advertisement -

బ్రెజిల్‌ ‘జడ్జి’ వీసా రద్దు చేసిన అమెరికా
మాజీ అధ్యక్షుడి అక్రమాలకు ట్రంప్‌ వత్తాసు
న్యూయార్క్‌:
బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో కాలి చీలమండకు ఎలక్ట్రానిక్‌ పర్యవేక్షక పరికరాన్ని అమర్చి ఆయన కదలికల్ని గమనించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ చర్యలపై అమెరికా దీటుగా స్పందించింది. బోల్సొనారోపై ఆంక్షలు విధించిన బ్రెజిల్‌ న్యాయమూర్తి వీసాను రద్దు చేసింది. అంతకుముందు ట్రంప్‌ స్పందిస్తూ.. తన మిత్రుడైన బోల్సొనారో పట్ల బ్రెజిల్‌ న్యాయవ్యవస్థ అన్యాయంగా వ్యవహరించిందని పేర్కొన్నారు.మాజీ అధ్యక్షుడు బోల్సొనారోపై బ్రెజిల్‌ సుప్రీం ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని అమెరికా విదేశాంగమంత్రి మార్కో రుబియో ఆరోపించారు. న్యాయస్థానం చర్యలు బ్రెజిలియన్ల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా అమెరికన్లను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నమేనని మండిపడ్డారు. బోల్సొనారోపై ఆంక్షలు విధించిన జడ్డితోపాటు ఆయనకు మద్దతుగా నిలిచిన న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులకు కూడా వీసా ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

బోల్సొనారోపై ఆరోపణలు
2022 ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని బోల్సొనారో.. ఆ ఎన్నికలు రద్దు చేసి తిరుగుబాటు చేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సుప్రీం ఫెడరల్‌ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రిపూట ఇల్లు విడిచి వెళ్లకూడదని, విదేశీ రాయబారులతో మాట్లాడరాదని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే సోషల్‌ మీడియా వినియోగించరాదని, తన కుమారుడు ఎడ్వర్డో బోల్సొనారోతో పాటు విచారణ ఎదుర్కొంటున్న ఇతర నిందితులతోనూ మాట్లాడకూడదని ఆజ్ఞాపించింది. ఆయన నివాసం, పార్టీ కార్యాలయాల్లో సోదాలకు అనుమతించిన న్యాయస్థానం.. యాంకిల్‌ మానిటర్‌ను ధరించాలని పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు తన కాలికి ఎలక్ట్రానిక్‌ పర్యవేక్షక యంత్రాన్ని అమర్చుకున్న మాజీ అధ్యక్షుడు.. ఇది తనకు జరిగిన తీవ్ర అవమానమని వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -