నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గ్రామంలోని పలు కాలనీలో మురికి కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయి మురికినీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. స్థానిక గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో గ్రామంలోని ఆయా కాలనీలో పూడుకుపోయిన మురికి కాలువల్లో చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. కార్మికులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ స్వయంగా
పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ప్రజలు కూడా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తోడ్పాటును అందించాలని కోరారు. చెత్తాచెదారం మురికి కాలువల్లో వేయకుండా తడి చెత్త, పొడి చెత్తను ఇండ్లలో వేరువేరుగా నిలువుగా ఉంచి గ్రామపంచాయతీ చెత్త సేకరణ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులో వేసి సిబ్బందికి సహకరించాలన్నారు. ప్రజలు చెత్తాచెదారాన్ని మురికి కాలువల్లో వేయడం వల్ల మురికి కాలువలు కూడుకుపోయి మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తుందన్నారు. అంతేకాకుండా మురికి నీరు నిల్వ ఉండడం మూలంగా ఈగలు, దోమలు వృద్ది చెంది ప్రజలు అనారోగ్యాలకు గురవుతారన్నారు. గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు గ్రామపంచాయతీకి సహకరించాలని కోరారు.



