Monday, June 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅధికారుల సమిష్టి కృషితోసరస్వతీ పుష్కరాలు విజయవంతం

అధికారుల సమిష్టి కృషితోసరస్వతీ పుష్కరాలు విజయవంతం

- Advertisement -

– గోదావరి పుష్కరాలు వైభవంగా నిర్వహించాలి : రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-భూపాలపల్లి

అన్ని శాఖల అధికారుల సమిష్టి కృషితో సరస్వతీ పుష్కరాలు విజయవంతమయ్యాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శనివారం జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్‌లో జిల్లా కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధ్యక్షతన ‘సరస్వతీ పుష్కరాలు డే ఆఫ్‌ థాంక్స్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ… పుష్కరాలు ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన మేరకు జిల్లా యంత్రాంగం 12 రోజులు 24 గంటలు నిర్విరామంగా కష్టపడిందని తెలిపారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని సరస్వతీ పుష్కరాల’ నిర్వహణను ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుని నిర్వహించినట్టు తెలిపారు. ప్రభుత్వం రూ.40కోట్లు కేటాయించగా పుష్కరాలను అత్యంత విజయవంతంగా అధికారులు నిర్వహించారని హర్షం వ్యక్తం చేశారు. సుమారు 30లక్షల మంది దర్శించుకున్నారని తెలిపారు. 33 శాఖలకు చెందిన అధికారులు మూడు నెలలు కష్టపడ్డారని అన్నారు. తెలంగాణలో తొలిసారిగా కాశీ పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన ”సరస్వతీ నవరత్న మాలా హారతి” కార్యక్రమం మొత్తం పుష్కరాలకే ప్రధాన ఆకర్షణగా నిలిచిందన్నారు. పుష్కరాల ద్వారా ఆర్టీసీకి సుమారు రూ.10 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. 12 రోజుల పాటు దాదాపు 9 వేల ట్రిప్పుల బస్సులు నడిచాయని చెప్పారు. కొందరు సరస్వతీ పుష్కరాలు విజయవంతం కాకుండా చేయాలని కుట్రలు పన్నారనీ, అయినా సందర్శకులు అవేమీ పట్టించుకోకుండా లక్షలలో పుష్కర స్నానాలు ఆచరించారని అన్నారు. స్వచ్ఛంద సంస్థల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. పుష్కరాల్లో లోటుపాట్లను గుర్తించి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. కాళేశ్వరానికి వెళ్లే జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో కాళేశ్వరం, ఇతర ప్రాంతాల్లో కొత్త బస్సు డిపోల నిర్మాణానికి శ్రీకారం చుడతామని అన్నారు. ఓవైపు అభివృద్ధి… మరోవైపు సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే తొలిస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే ఉచిత బస్సు, 200లోపు యునిట్లు ఉచిత విద్యుత్‌, రాజీవ్‌ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి లాంటి అనేక ప్రతిష్టాత్మక పథకాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. అయినా… కొందరు పనిగట్టుకొని మేం ఏమి చేయడం లేదంటూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రమాదంలో మరణించిన కొమురవెల్లి గ్రామస్తులకు లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వడదెబ్బకు గురై మరణించిన పారిశుద్ధ్య కార్మికుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ కిరణ్‌ ఖరే, ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ అయిత ప్రకాశ్‌ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్‌ కుమార్‌, విజయలక్ష్మి, సింగరేణి జిఎం రాజేశ్వర్‌ రెడ్డి, ఆర్టీసీ వరంగల్‌ ఆర్‌ఎం విజయభాను, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -