నవతెలంగాణ-హైదరాబాద్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ తరహాలో తెలంగాణలోను ఓట్ల చోరీకి ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ తరహా కుట్రలు చేసే వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత తమందరిపై ఉందని సీఎం చెప్పారు.
ఇవాళ రవీంద్రభారతిలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బుద్దపూర్ణిమ ప్రాజెక్టు ఆఫీస్ వద్ద పాపన్న గౌడ్ విగ్రహానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఓట్ల చోరీ బాగోతంపై రాహుల్ గాంధీ సమరశంఖం పూరించారని, దొంగ ఓట్ల నమోదుపై పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారని గుర్తు చేశారు.
ఓటు హక్కును దొంగిలించిన వారిని శిక్షించాలని రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని త్వరలో నేను, డిప్యూటీ సీఎం ఆ పాదయాత్రలో పాల్గొని మద్దతు ఇస్తామన్నారు. బహుజనుల సామ్రాజ్యాన్ని అందరికీ ఎలా అందించవచ్చో పాపన్న గౌడ్ నిరూపించారని పేర్కొన్నారు. పాపన్నగౌడ్ కోటను గత ప్రభుత్వాలు మైనింగ్ లీజులకు ఇచ్చాయన్నారు. కానీ తాము చరిత్ర స్ఫూర్తితో కోటను చారిత్రక కట్టడాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు చెప్పారు.