– మూడు వారాలు చీఫ్ మున్సిపల్ కమీషనర్ గా బాధ్యతలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
పరిపాలనా శిక్షణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించబడిన శిక్షణా కలెక్టర్ సౌరబ్ శర్మ మూడు వారాల పాటు అశ్వారావుపేట మున్సిపాల్టీ చీఫ్ మున్సిపల్ కమీషనర్గా విధులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం అధికారికంగా విధుల్లో చేరారు. విధుల్లో భాగంగా ముందుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఆయన,వివిధ విభాగాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. మున్సిపాలిటీ కార్యనిర్వహణ విధానాలపై కమిషనర్ బి.నాగరాజు ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం మున్సిపాల్టీ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించిన ఆయన పారిశుధ్య నిర్వహణ,ఇంటి పన్నుల వసూలు,మౌలిక సదుపాయాల స్థితిగతులు పై స్థానికులతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు. స్థానిక పరిపాలన పనితీరును క్షుణ్ణంగా అధ్యయనం చేయనున్నారు. ప్రస్తుతం సర్వే జరుగుతున్న దొంతికుంట చెరువు, అలాగే నిర్మాణానికి సిద్ధమవుతున్న మినీ స్టేడియం ప్రదేశాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో శిక్షణా కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ నాగరాజు తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.



