Thursday, December 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసావిత్రిబాయి ఫూలే ఒక చరిత్ర

సావిత్రిబాయి ఫూలే ఒక చరిత్ర

- Advertisement -

– పదేండ్ల విధ్వంసం నుంచి వికాసం దిశగా రాష్ట్రం : పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌
– నిజామాబాద్‌లో సావిత్రిబాయి ఫూలే విగ్రహావిష్కరణ
నవతెలంగాణ-కంఠేశ్వర్‌

సావిత్రిబాయి పూలే అంటే ఒక చరిత్ర అని, చదువు ప్రాముఖ్యతను చాటిచెప్పిన మహిళ అని పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. బుధవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని హనుమాన్‌ జంక్షన్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి ఫూలే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్‌ షబ్బీర్‌ అలీ, అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణతో కలిసి పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్‌ ప్రారంభించారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. 200 ఏండ్ల కిందటే చదువు ప్రాముఖ్యతను గుర్తించి బడుగు, బలహీన వర్గాలకు, వితంతువులకు, నిరుపేదలకు, నిరాశ్రయులకు చదువు నేర్పించిన చదువుల తల్లి సావిత్రిబాయి అని అన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలన విధ్వంసం నుంచి ప్రజా ప్రభుత్వ పాలనలో రాష్ట్రం వికాసం దిశగా ముందుకు వెళుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి పనిచేస్తున్నారని, ఆయన ఒక విజన్‌ ఉన్న నాయకుడని అన్నారు. గ్లోబల్‌ సమ్మిట్‌లో రూ.1.70లక్షల కోట్లు విలువైన పెట్టుబడులకు ఒప్పందం కుదరడం ఇందుకు ఉదాహరణ అని అన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా సర్పంచ్‌ స్థానాలు గెలిచామని, స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాడుతామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నుడా చైర్మెన్‌ కేశ వేణు, డీసీసీ అధ్యక్షులు నగేష్‌రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌, వ్యవసాయ కమిషన్‌ మెంబర్‌ గడుగు గంగాధర్‌, గ్రంథాలయ చైర్మెన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు నరాల సుధాకర్‌, ఆకుల ప్రసాద్‌, దర్శనం దేవేందర్‌, కరిపె రవీందర్‌, మాడవేడి వినోద్‌కుమార్‌, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -