న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ దిగ్గజ విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కేంద్రానికి భారీ డివిడెండ్ను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25)కు గాను రూ.8,076.84 కోట్ల డివిడెండ్ను అందజేసింది. ఈ మొత్తం విలువ చేసే చెక్కును సోమవారం కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్కు ఎస్బీఐ చైర్మెన్ సిఎస్ శెట్టి అందజేశారు. ఫైనాన్సియల్ సర్వీసెస్ సెక్రెటరీ ఎం నాగరాజు, ఫైనాన్స్ సెక్రెటరీ అజరు సేత్ సమక్షంలో ఈ మొత్తాన్ని అందజేశారు. 2023-24లో కేంద్రానికి మొత్తంగా రూ.6,959.29 కోట్ల డివిడెండ్ను అందించింది. 2024-25కు గాను ప్రతీ ఈక్విటీ షేర్పై రూ.15.90 డివిడెండ్ను ప్రకటించింది. ఇంతక్రితం ఏడాదిలోని రూ.13.70 డివిడెండ్తో పోల్చితే ఎక్కువ. గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25లో ఎస్బీఐ రికార్డ్ స్థాయిలో రూ.70,901 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాదిలోని రూ.61,077 కోట్లతో పోల్చితే 16 శాతం ఎక్కువ లాభాలను ఆర్జించి.. మెరుగైన ప్రగతిని కనబర్చింది.