– తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ, ఎస్టీ బెస్ట్ ఎవైలబుల్ స్కూళ్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దళిత, గిరిజన పేద పిల్లలు ప్రయివేటు పాఠశాలల్లో ఉచితంగా చదివేందుకు గత 35 ఏండ్ల క్రితం ప్రవేశపెట్టిన బెస్ట్ ఎవైలబుల్ పథకం నిరాటంకంగా కొనసాగుతూ వస్తున్నదని పేర్కొన్నారు. .వివిధ జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందిన ప్రయివేట్ స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ప్రభుత్వం చెల్లించే ఫీజులతో ఉచితంగా విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన నాటి నుండి ఈ పథకానికి ఆటంకాలు కల్పిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేండ్లుగా చెల్లించాల్సిన ఫీజు బకాయిలను చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నెల 20 వరకు పాఠశాలలు తెరిచే పరిస్థితి లేదని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్చలు జరిపి, బకాయి పడ్డ రూ.154 కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన ఆరునెలల్లోపే బడా కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులకు చెల్లించాల్సిన రూ. వేలకోట్ల బిల్లులను ఆగమేఘాల మీద చెల్లించిందని గుర్తు చేశారు. కానీ పేద దళిత, గిరిజన విద్యార్థులు చదువుతున్న ప్రయివేట్ స్కూళ్లకు చెల్లించాల్సిన ఫీజులను చెల్లించకపోవడం ఆ తరగతుల పట్ల తీవ్ర వివక్ష పాటించడమేనని విమర్శించారు. బెస్ట్ అవైలబుల్ క్రమంగా నిర్వీర్యం చేసి పూర్తిగా రద్దు చేయాలని కుట్రలు చేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. రెండేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 180 ప్రయివేటు స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీ విద్యా ర్థులు 26 వేల మంది చదువుతున్నారనీ, వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదికి డే స్కాలర్కు రూ.28 వేలు, రెసిడెన్షియల్కు రూ.42 వేలు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. తక్కువ ఫీజులోనే చదువు, భోజనం, దుస్తులు, పుస్తకాలు, వసతి కల్పి స్తున్నారన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా తక్షణం ప్రయివేటు స్కూళ్లకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాలనీ, లేకపోతే దళిత, గిరిజన సంఘాలు, విద్యార్థిసంఘాలను కలుపుకుని రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పూనుకుంటామని హెచ్చరించారు.
ఎస్సీ ఎస్టీ బెస్ట్ ఎవైలబుల్ స్కూళ్ల బకాయిలు విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES