– విద్యార్థినులపై లైంగిక వేధింపులకు చర్యలు
– 10 మంది ఉపాధ్యాయులపైనా బదిలీ వేటు
– తల్లిదండ్రుల ఆందోళన
– కురిక్యాల జెడ్పీ పాఠశాలలో ఘటన
– విచారణ జరిపి నివేదిక అందించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం
నవతెలంగాణ-గంగాధర
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలపై లైంగిక వేధింపుల ఘటనలో అటెండర్ యాకుబ్పాషా, ప్రధానోపాధ్యాయురాలు టి.కమలను జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పది మంది ఉపాధ్యాయులపై బదిలీ వేటు వేశారు. బాలికల ఫొటోలు తీసి మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడిన అటెండర్ ఎండి.యాకుబ్ పాషాను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. విషయం తెలిసి పోలీసులకు సమాచారం ఇవ్వని హెచ్ఎంపై కూడా కేసు చేశారు. ఈ సంఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు మంగళవారం పాఠశాల ఎదుట బైటాయించి ఆందోళన చేశారు. లైంగిక వేధింపుల ఘటనపై ఉన్నతాధికారులకు నివేదించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన జడ్పీహెచ్ఎస్ కురిక్యాల గ్రేడ్-2 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయు రాలు టి.కమలను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై విచారణకు ముగ్గురు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి.. నివేదిక సమర్పించాలని ఆదేశించారు. లైంగిక వేధింపుల ఘటనను కేంద్ర మంత్రి బండి సంజరు కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గంగాధర మండల బంద్ చేపట్టారు.
పాఠశాల హెచ్ఎం, అటెండర్ సస్పెన్షన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



