Friday, June 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పండుగ వాతావరణంలో పాఠశాలలు పునః ప్రారంభించాలి 

పండుగ వాతావరణంలో పాఠశాలలు పునః ప్రారంభించాలి 

- Advertisement -

మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ 
నేడు అన్ని పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 
విద్యార్థుల చేతికి రేపే యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు 
నవతెలంగాణ – పెద్దవంగర
: నూతన విద్యా సంవత్సరాన్ని పండుగ వాతావరణంలో పాఠశాలలను పున: ప్రారంభించాలని మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. రేపటి నుంచి మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభంకానున్నాయని తెలిపారు. దీని కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాల పరిసరాలను పండుగ వాతావరణంలో మామిడి తోరణాలు కట్టి విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలకాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పటిష్ట చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే పాఠశాలను ప్రారంభమైన మొదటి రోజున విద్యార్థుల చేతికి యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అందజేయడానికి అన్ని చర్యలు చేపట్టిందన్నారు. దీంతోపాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని చెప్పారు. పాఠశాలల పునః ప్రారంభం నేపథ్యంలో తరగతి గదులు, పరిసరాలు, కిచెన్ గది, టాయిలెట్లు అన్ని శుభ్రం చేయించినట్లు తెలిపారు. సర్కారు పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది రికార్డు స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన 30 మంది విద్యార్థులు 550 మార్కుల పైగా సాధించినట్లు వివరాలు వెల్లడించారు. భవిష్యత్తులోనూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఉన్నత విద్యలో వెయిటేజ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపి అప్పుల పాలు కావద్దని సూచించారు. మన ఊరు- మనబడి ని మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కాగా మండల వ్యాప్తంగా నేడు 5 జెడ్పీ ఉన్నత పాఠశాలలు, 5 ప్రాథమికోన్నత పాఠశాలలు, 18 ప్రాథమిక పాఠశాలలు, కేజీబీవీ పాఠశాల నేడు పునః ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -