హిండెన్బర్గ్ కేసులో అనూహ్య ఆర్డర్
ముంబయి : దేశంలోని న్యాయస్థానాలే కాదు కీలక రెగ్యూలేటరీ సంస్థలు సైతం అదానీకి అనుకూలంగా మారాయి. అదానీ ఆర్థిక అక్రమాలపై అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ చేసిన కీలక ఆరోపణలను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తాజాగా తోసిపుచ్చింది. అదానీ గ్రూప్ కంపెనీలు ఎటువంటి నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడలేదని గురువారం పెట్టుబడులు, మార్కెట్ల రెగ్యూలేటర్ క్లీన్చిట్ ఇచ్చింది. ”అదానీపై హిండెన్బర్గ్ ఆరోపణలు నిరూపణ కాలేదు. అదానీ గ్రూప్ కంపెనీలు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు. ఆ సంస్థపై జరిమానా విధించాల్సిన అవసరం లేదు.” అని సెబీ హోల్ టైం మెంబర్ కమలేష్ చంద్ర వర్షనేరు తన ఆర్డర్లో పేర్కొన్నారు. దీంతో అదానీ పోర్ట్స్, అదానీ పవర్, గౌతమ్ అదానీ, రాజేష్ అదానీలపై కొనసాగుతున్న దర్యాప్తు కార్యకలాపాల ను సెబీ రద్దు చేసినట్లయ్యింది. బిలియనీర్ గౌతం అదానీ అవినీతిని కీలక ఆధారాలతో 2023 జనవరిలో హిండెన్బర్గ్ బయటపెట్టిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ తన కంపెనీల ఆదాయాన్ని పెంచడానికి, షేర్ల ధరలను కృత్రిమంగా మార్చడానికి విదేశీ బినామీ, షెల్ కంపెనీలను వాడుకుందని.. అదానీ తీవ్ర ఆర్ధిక మోసాలకు పాల్పడ్డారని అప్పట్లో వెల్లడించింది. ఆ దెబ్బతో ఆ సమయంలో స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూపు కంపెనీల విలువ దాదాపు లక్షల కోట్లు హరించుకు పోయింది.
అదానీ ఆర్థిక అక్రమాలను నిశితంగా పరిశీలించామని.. సాక్షాలను సంపాదించామని… దాదాపు 100 పేజీల సాక్ష్యాలను రిపోర్ట్లో పొందుపర్చామని అప్పట్లో హిండెన్వర్గ్ పేర్కొంది. అప్పటి సెబీ చైర్పర్సన్ మాధాబి పురీ బుచ్కు అదానీ గ్రూపు సంస్థలతో ఉన్న అక్రమ ఆర్థిక సంబంధాన్ని సైతం హిండెన్బర్గ్ బయటపెట్టిన విషయం తెలిసిందే. హిండెన్ బర్గ్ ఆరోపణలు నిరాధారం అంటూనే బెర్ముడా, మారిషస్ వంటి అఫ్ షోర్ కంపెనీల్లో, అందునా గౌతం అదానీ సోదరుడు వినోద్ అదానీ ఆధ్వర్యంలోని ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు బుచ్ ఫ్యామిలీ అంగీకరించిందని హిండెన్బర్గ్ తెలిపింది. తన భర్త బాల్య స్నేహితుడు నిర్వహిస్తున్న ఫండ్లోనూ పెట్టుబడులు పెట్టారని మాధాబి అప్పట్లో ధృవీకరిం చారు. ‘అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడుల తీరును సమీక్షించాల్సిన సెబీ ఛైర్మన్కు వాటిల్లో వ్యక్తిగత పెట్టబడులు, ఇతర స్పాన్సర్ల నిధులు ఉన్నాయి. ఇది విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తుంది.’ అని హిండెన్బర్గ్ ఆరోపించింది. అదానీ కంపెనీలతో సెబీ మాజీ ఛైర్పర్సన్ మాధాబి అంటకాగడం.. ఇతర తీవ్ర ఆరోపణల నేపథ్యంలో సెబీ తాజా ఆర్డర్ నిపుణులను విస్మయానికి గురి చేస్తోంది.