నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీలలో చైర్పర్సన్/వైస్ చైర్పర్సన్, పరోక్ష ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ వరకు జిల్లాలో భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 163 (144)అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల నియమావళి ప్రకారం జిల్లాలో కఠినంగా అమలులో కొనసాగుతుందని ప్రశాంతంగా, నిర్భయంగా, పారదర్శకంగా జరిగేలా ముందస్తు జాగ్రత్త లో భాగంగా సెక్షన్ 163ను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. సంబంధిత అధికారులకు ముందస్తు అనుమతి లేకుండా ఏ ప్రజా లేదా ప్రైవేట్ ప్రదేశంలో ముగ్గురికి మించి వ్యక్తులు గుమికూడరాదని స్పష్టం చేశారు. అనధికార సమావేశాలు, శిబిరాలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే విధంగా గుంపులు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు.
జిల్లాలోఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్ వాహనాలు, టూర్ వాహనాలు లేదా ఇతర మార్గాల ద్వారా ముందస్తు అనుమతి లేకుండా ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుందని పేర్కొన్నారు. ప్రజలు రాజకీయ నాయకులు ఎన్నికల నియమాలను గౌరవించి సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు.



