ప్రభుత్వం పారదర్శకత ప్రదర్శించాలి : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్
న్యూఢిల్లీ : సెక్యులరిజాన్ని నిజ జీవితంలో అమలు చేయాలని, ఆచరణలో చూపాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ అన్నారు. మతపరమైన అణచివేత, సెక్యులరిజం వంటి విషయాల్లో ప్రభుత్వం పారదర్శకత, న్యాయపరమైన నిష్పాక్షికత చూపాలని చెప్పారు. భారత్లో సెక్యులరిజమంటే ప్రభుత్వం ఏ మతానికీ అనుకూలంగా లేకుండా, ఏ మతాన్నీ శిక్షించకుండా ఉండడమని చెప్పారు. అయితే ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే అధికారులు, సిబ్బంది వేర్వేరు మతాలు, సమాజాలకు చెందినవారనీ, కాబట్టి వారి చర్యలు పూర్తి పారదర్శకంగా ఉండాలని న్యాయమూర్తి సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వ రివ్యూ పిటిషన్పై తీర్పులో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్లో సెక్యులరిజం అంటే ప్రభుత్వం అన్ని మతాల పట్ల తటస్థంగా ఉండడమని చెప్పారు. భారత్ తనకంటూ ప్రత్యేకమైన సెక్యులరిజం భావనను అభివృద్ధి చేసుకున్నదనీ, ప్రభుత్వం ఏ మతాన్నీ ప్రోత్సహించదు, అలాగే ఏ మతాన్నీ ఆచరించడాన్ని శిక్షించదని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం తన చర్యలను ఆదర్శ భావానికి అనుగుణంగా మార్చుకోవాలని చెప్పారు.



