నవతెలంగాణ – రాయపోల్
రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించి పదవ తరగతి విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. రాజ్ కుమార్ తెలిపారు. బుధవారం రాయపోల్ మండలం రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పాత్రలను స్వీకరించి పాఠశాల పరిపాలనను నిర్వహించడంతో కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భానుశ్రీ, జిల్లా కలెక్టర్ హారిక, జిల్లా విద్యాశాఖ అధికారి కే. పూజ, మండల విద్యాశాఖ అధికారి విగ్నేష్ తమ తమ పాత్రలను సమర్థవంతంగా నిర్వహించారు. అధికారులుగా విద్యార్థులు ప్రదర్శించిన హుందాతనం,వాక్చాతుర్యం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది.విద్యార్థుల్లో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలు, పరిపాలనా నైపుణ్యాలను వెలికితీసేలా ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్, గ్రామ సర్పంచ్ నరేష్ గౌడ్ పర్యవేక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ, విద్యార్థులు చూపిన ప్రతిభ, ఆత్మవిశ్వాసాన్ని కొనియాడారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం జి.నరేందర్ రెడ్డి, యాదయ్య, నవీన్కుమార్, మహేష్, మంజుల, సుజాత శ్యాంసుందర శర్మ, అనీఫ్, ఉమా, సి ఆర్ పి స్వామి గౌడ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



