నవతెలంగాణ – హైదరాబాద్: నాగర్కర్నూల్ జిల్లా ముచ్చర్లపల్లిలో ఆదివారం జరిగిన విషాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు నీటి గుంతలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్లోని తుర్కయాంజల్లో నివసించే శ్రీకాంత్రెడ్డి తన తల్లి సరస్వతమ్మను చూసేందుకు భార్యాపిల్లలతో కలిసి శనివారం స్వగ్రామమైన ముచ్చర్లపల్లికి వచ్చారు. ఆదివారం సరదాగా గడిపేందుకు పిల్లలతో కలిసి పొలానికి వెళ్లారు. అక్కడ నీటి గుంత పక్కన ఫోటోలు దిగుతున్న సమయంలో, శ్రీమాన్యు (12) ఒక్కసారిగా కాలుజారి నీటిలో పడిపోయాడు. తమ్ముడిని కాపాడే ప్రయత్నంలో అక్క శ్రీకృతి (14), మేనత్త కూతురు స్నేహ (17) కూడా నీటిలోకి దిగి మునిగిపోయారు.
మరో బాలిక విద్యాధరణిని తండ్రి శ్రీకాంత్రెడ్డి సకాలంలో బయటకు లాగగలిగినా, మిగిలిన ముగ్గురిని కాపాడలేకపోయారు. తనకు ఈత రాకపోవడంతో, తన కళ్లముందే బిడ్డలు ప్రాణాలు విడుస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆయన ఉండిపోవడం అక్కడి వారిని కలిచివేసింది. శ్రీమాన్య 6వ తరగతి, శ్రీకృతి 8వ తరగతి చదువుతుండగా, స్నేహ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుల్లో ఎంతో చురుగ్గా ఉండే ఈ ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటం చూసి గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



