కేంద్రం సుప్రీం కోర్టుతో ఎలా చెలగాటమాడుతున్నదో అత్యున్నత న్యాయవ్యవస్థకు సంబంధించిన వివాదాలు, వ్యాఖ్యానాలు చూస్తే అర్థమవుతుంది. సాక్షాత్తూ ప్రధాన న్యాయమూర్తి సిజెఐ బిఆర్ గవారు,నవంబరులో ఆయన పదవీ విరమణ అనంతరం బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ సూర్యకాంత్లు మాట్లాడిన మాటలే ఇందుకు తార్కాణంగా వున్నాయి. జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణానంతరం వరుసగా వచ్చే సిజెఐ లెవరూ ఆరుమాసాల మించి కొనసాగే అవకాశం లేదని అందరికీ తెలుసు.అంటే కీలకమైన రాజ్యాంగ సవాళ్లు, నియామకాలు, వ్యవస్థాగతమైన నిర్ణయాలు తేల్చకుండా పేరబెట్టేందుకూ, నచ్చనివి ఆలస్యం చేసేందుకు అవకాశం లభించినట్టుగా మోడీ ప్రభుత్వం భావిస్తున్నది.గవర్నర్లపై గతంలో ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం లేవనెత్తడం ఇందుకో ఉదాహరణ మాత్రమే. పూర్తిగా రాజ్యాంగ నిబంధనల మేరకు ఇచ్చిన కీలకమైన తీర్పునే తిరగదోడేందుకు స్వయంగా రాష్ట్రపతిని రంగంలోకి దింపడం అందుకోసమే. ఈ వ్యూహాలు ఎలా వున్నా ప్రాథ మిక హక్కుల రక్షణకు మాత్రం కట్టుబడి వున్నానని సుప్రీం కోర్టు స్పష్టం చేస్తున్నది. కానీ రోజువారీ నిర్వహణకు సంబంధించిన ఆలస్యాలు, ఆటంకాలు మాత్రం అనివార్యంగా వెంటాడుతుండటం ఆందోళన కలిగిస్తుంది.
ముక్కలు చేస్తే ఎలా?
మే 26న బాధ్యతలు స్వీకరించిన వెంటనే జస్టిస్ గవారు కేంద్ర ప్రభుత్వానికి ఒక వర్తమానం పంపించారు. కొలీజియం తొలి సమావేశానికి అధ్యక్షత వహించినప్పుడే సమూలమైన మార్పులు ప్రతిపాదించారు. జడ్జిల నియామకాలకూ,బదిలీలకూ సంబంధించి చేసే సిఫార్సులపై ఏక మొత్తంగా చర్య తీసుకోవాలి తప్ప దశలవారిగా ముక్కలు ముక్కలుగా నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన కోరారు.కొలీజియం పంపిన సిపార్సుల్లో కొన్నింటిని విడదీసి నిర్ణయాలు చేస్తే సీనియారిటీ దెబ్బతినిపోవడమ గాక దాని సాధికారత గురించే సందేహాలు ఏర్పడతాయన్నది ఆయన అభిప్రాయంగా చెబుతున్నారు. సిజెఐ గవారు రాకముందటి కాలానికి సంబంధించిన కొన్ని సిఫార్సులే ఇప్పటికీ పెండింగులో వున్నాయని న్యాయవర్గాలు చెబుతు న్నాయి. ప్రస్తుతం కొలీజియంలో సిజెఐగాక న్యాయమూర్తులు సూర్యకాంత్, విక్రమ్నాథ్, జెకె మహేశ్వరి, బివి నాగరత్న సభ్యులుగా వున్నారు. బాధ్యతలు చేపట్టగానే తొలి చర్యగా జస్టిస్ గవారు ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను సుప్రీం కోర్టుకు సిఫార్సు చేశారు. జస్టిస్ అంజారయా, విజరు బిష్ణోరు, ఎఎస్ చంద్రార్కర్ల పేర్లను పంపించారు.ఆ పేర్లన్నింటినీ కేంద్రం వెంటనే ఆమోదించడంతో సుప్రీంకోర్టు పూర్తి సంఖ్య 34కు చేరుకున్నది.
సుప్రీంకోర్టు జడ్జిల నియామక సిఫార్సులతో పాటు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా అయిదుగురి పేర్లను పంపుతూ, మరో నలుగురు ప్రధాన న్యాయమూర్తులను అటూ ఇటూ బదలాయించేలా పేర్లు పంపించింది. 22 మందిని వారి వ్యక్తిగత అభ్యర్థనలను లేదా వ్యవస్థ అవసరాలను బట్టి బదిలీ చేసింది.ప్రత్యేకించి ఢిల్లీ హైకోర్టుకు ఆరుగురు జడ్జిలను ప్రతిపాదించింది. ఇందులో ఒకరు మాత్రం ఆమోదం తెలపడంలో ఆలస్యం వల్ల పూర్తి కాలేదు.వాస్తవానికి నియామకాల ప్రక్రియలో అన్ని ప్రతిపాదనలూ ఒకేసారి ఆమోదించాలన్న నిబంధనేమీ లేదు. అయినా న్యాయవ్యవస్థ మాత్రం అందులోని చిక్కులరీత్యా ముక్కలుముక్కల కింద చూడొద్దనే చెబుతున్నది. 2014లో అప్పటి సిజెఐ ఆర్ఎం లోధా ఈ విషయమై మాజీ న్యాయమంత్రి రవిశంకర్కు అభ్యంతరం తెలియజేశారు.మాజీ సోలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం పేరును పక్కన పెట్టడం పట్ల ఆయన అభ్యంతరం చెప్పగా సుబ్రహ్మణ్యం తన నామినేషన్నే ఉపసంహరించుకున్నారు. 2022లో జస్టిస్ సంజరు కిషన్ కౌల్ నాయకత్వంలోని ధర్మాసనం ఈ విధంగా ఇష్టమైన వారిని మాత్రమే కేంద్రం ఎంచుకునే పద్ధతి పనిలో విశ్వాసానికి విఘాతం కలిగిస్తుందని,తప్పు సంకేతాలు పంపుతుందనీ విమర్శించారు.అయితే 2023 డిసెంబర్లో ఆయన పదవీవిరమణ చేయడంతో ఆ విచారణ ముందుకు సాగడం లేదు.
స్వతంత్రత,సమతుల్యత
న్యాయవ్యవస్థకు సంబంధించిన విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి గాను జ్యుడిషియల్ కమిషన్ నియమించాలని చాలా కమిటీలు సిపార్సులు చేశాయి. అయితే దానికి బదులుగా మోడీ సర్కారు 2014లో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం(ఎన్జాక్) తీసుకొచ్చింది. సమూలమైన సంస్కరణల కోసం గాక కేవలం నచ్చినవారిని నియమించుకునే అధికారం కోసం తెచ్చిన బిల్లు ఇది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తున్నదనే కారణంగా దీన్ని సుప్రీం కోర్టు ధర్మాసనం 2015లో కొట్టివేసింది. అప్పటి నుంచి ఒక నియామక నియమావళి రూపొందించుకోవాలని అంటున్నా అది పూర్తి కావడం లేదు. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవడం తప్పనే వాదన చాలామంది తీసుకొస్తుంటారు గానీ, ప్రభుత్వం లేదా కార్యనిర్వాహక వర్గం నియమించడం కూడా వాంఛనీయం కాదనేది మరో కోణం. న్యాయవ్యవస్థ తీరుపైన కొందరు న్యాయ మూర్తులపై ఆరోపణల గురించి ఎప్పుడూ చర్చ లేవనెత్తి ప్రభుత్వానికి పెత్తనం ఇవ్వడమే దీనికి పరిష్కారమన్నట్టు మాట్లాడుతుంటారు. ఇటీవలి కాలంలోనైతే స్వయంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ న్యాయవ్యవస్థ కాదు, పార్లమెంటే సర్వోన్నతమన్న వాదన తీసుకొచ్చారు. న్యాయవ్యవస్థ స్వచ్ఛతనూ, స్వతంత్రతనూ కాపాడేవిధంగా ఏం చేయాలన్నదే ఇక్కడ సమస్య. కానీ బీజేపీ, దాని మద్దతుదారుల ఆలోచన వేరు.ఏదో విధంగా న్యాయవ్యవస్థపై పెత్తనం చేయాలన్నదే వారి అసలైన ఆలోచన.
సిజెఐ గవారు ఈ విషయంలో సూటిగానే స్పందించారు. అంతకుముందే సుప్రీంకోర్టులో జస్టిస్ అభరు ఎస్ ఓకా ధర్మాసనం స్పష్టతనిచ్చింది. ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగానికి లోబడి పనిచేయవలసిందే గానీ ఎవరూ అతీతులు కాదన్నది.న్యాయ, పాలనా,శాసన వ్యవస్థలు మూడు స్తంభాలనీ,పరస్పర గౌరవంతో మెలగాలని తన స్వరాష్ట్రం మహారాష్ట్రలోనే సత్కార కార్యక్రమంలో ఆయన ప్రకటించారు.రాజ్యాంగం 142వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు గనక ఏదైనా విషయంలో పూర్తి న్యాయం కోసం ఒక చర్య తీసుకోవడం అవసరమని భావిస్తే ఆమేరకు ఉత్తర్వునివ్వవచ్చునని ఆయన తేల్చిచెప్పారు. కానీ అదే సమయంలో నవంబరులో పదవి చేపట్టబోయే జస్టిస్ సూర్యకాంత్ అంటే విభిన్నమైన వైఖరి ప్రకటించారు. కోర్టులు శాసన వ్యవస్థను దాటి ప్రవర్తించరాదనీ, ప్రజాభిప్రాయాలపై స్వారీ చేయరాదని విమర్శించారు.అందుకు బదులుగా కోర్టులు ప్రజాస్వామ్య సంభాషణా ప్రక్రియను పటిష్టంచేయాలనీ, శృతిమించిన జోక్యంతో సమతుల్యతను దెబ్బతీయరాదని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా విపరీతంగా విస్తరించిన ప్రస్తుత కాలంలో ప్రతి తీర్పుపైన వెనువెంటనే అనేక రకాల స్పందనలు వస్తున్నాయనీ, అందరినీ సంతృప్తి పర్చడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. మితిమీరిన క్రియాశీలత న్యాయవ్యవస్థ టెర్రరిజంగా మారిపోకూడదని సిజెఐ గవారు కూడా తీవ్రవ్యాఖ్యలు చేశారు. సిజెఐల స్థాయిలోని ఇద్దరు కీలక న్యాయమూర్తులు ఇలా మాట్లాడటం యాదృచ్చికమేనా అని సందేహాలు వ్యక్తమైనాయి. ఇదిలావుంటే మరో సందర్భంలో సిజెఐ మాట్లాడుతూ బుల్డోజర్ న్యాయం అనుమతించబోమని తమ తీర్పుల ద్వారా చెప్పామన్నారు. అధికార యంత్రాంగం తానే న్యాయమూర్తి అధికారి తలారి అన్నట్టు వ్యవ హరిస్తామంటే కుదరబోదన్నారు. కోర్టు విచారణలో వుండగానే, ఉత్తర్వులు రాకుండానే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూల్చివేతలకు పాల్పడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదవులు, అవినీతి
ఈ నెలారంభంలో లండన్లో ఒక రౌండ్టేబుల్ సమావేశంలో సిజెఐ మాట్లాడుతూ జడ్జిల నియామకంలో ప్రభుత్వాలదే చివరిమాటగా వున్నదని, రెండుసార్లు సిజెఐల విషయంలో సీనియార్టీని తోసిపుచ్చిందని గుర్తు చేశారు. అదే సమయంలో న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన వెనువెంటనే పదవులు తీసుకోవడం సరికాదని కూడా గట్టిగా ప్రకటించారు. తాను అలా తీసుకోబోనని ఆయన ప్రకటిస్తే, జస్టిస్ ఓకా మాత్రం ఈ విషయంలో తాను పునరాలోచిస్తానని దాటవేశారు. కనీసం ఇద్దరు మాజీ సిజెఐలు గవర్నర్ పదవులు తీసుకోవడం, ఒకరైతే వెనువెంటనే రాజ్యసభకు వెళ్లడం సరైంది కాదనే భావం అందరిలో వుంది.అంతేగాక న్యాయ వ్యవస్థలో అవినీతిని గురించి కూడా ఇటీవల తరచూ విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సందర్భంలో నోట్లకట్టలు తగలబడిపోవడం ఇందుకు పరాకాష్ట.దీనిపై విచారణకు కోలీజియం ఉన్నత స్థాయి న్యాయమూర్తుల బృందాన్ని నియమించింది.దాని నివేదిక మేరకు ఆయన్ను రాజీనామా చేయమని కోరితే మొండికేశారు. గత్యంతరం లేక ఆయన అభిశంసన కోసం రాష్ట్రపతికి సిపార్సు చేసింది.దీనిపై సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వంటివారు సందేహాలు వ్యక్తం చేస్తూ జస్టిస్ వర్మకు మద్దతు తెల్పడంతో సుప్రీంకోర్టు పూర్తి నివేదికను బయటపెట్టింది. నోట్లు తగలబడిన గది తనది కాదన్న జస్టిస్ వర్మ వాదిస్తున్నా అది వాస్తవం కాదని, ఆయనే సూచనలు చేసి మరీ తగలబెట్టించారని నివేదిక పేర్కొంది.అయతే సిబాల్ వింత ధోరణిలో వాదిస్తున్నారు. న్యాయమూర్తిని తొలగించే అధికారం ప్రభుత్వానికివ్వడమేంటని ప్రశ్నిస్తూనే వర్మ చాలా మంచి న్యాయమూర్తి అని కపిల్ సిబాల్ కితాబులివ్వడం సందేహాలు పెంచుతున్నది. కేంద్రం ఈ విషయంలో త్వరగా రంగంలోకి దిగకుండా ఆలస్యం చేస్తున్నదని మరికొందరు విమర్శిస్తున్నారు.
మనోభావాలకు అంతెక్కడీ
న్యాయవ్యవస్థను రకరకాల వివాదాల్లోకి లాగి ఇరకాటంలో పెడుతున్న ఈ పూర్వరంగంలో నటుడు కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. తమిళం నుంచి కన్నడం పుట్టిందని తాను ప్రేమతో చెప్పానే గానీ తక్కువ చేయడానికి కాదనీ, ప్రేమ క్షమాపణలు కోరదని కమల్ గట్టిగా వాదించారు. అసలు ఏవో వ్యాఖ్యలకు గాను ఆయన క్షమాపణలు చెప్పాలని ఆదేశించే పని హైకోర్టుకు ఎందుకని అత్యున్నత న్యాయస్థానం ఫ్రశ్నించింది.థగ్లైఫ్ చిత్రం విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్దేశించింది. భిన్న మతాలు, కులాలు, భాషలతో కూడిన ఈ దేశంలో ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బతింటాయని, భావప్రకటనా స్వేచ్చను హరించలేమని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ విధంగా సుప్రీంకోర్టు స్థాయిలో వ్యాఖ్యలు, వివాదాలు కూడా సంచలనాత్మకంగా మారడం విశేషమే.
తెలకపల్లి రవి
సుప్రీం న్యాయమూర్తుల సంచలన వ్యాఖ్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES