– ట్యాంకర్ లారీ టైర్ల కింద నలిగిన తండ్రీ కూతురు
– ప్రాణాలు కాపాడండి అన్నా.. అంటూ విద్యార్థిని వేడుకోలు
– రక్షించేందుకు స్థానికులు యత్నం..
నవతెలంగాణ-షాద్నగర్ రూరల్
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ ముఖ్య కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలేజీ కోసం బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే తండ్రీ కూతురు విగతజీవులయ్యారు. ట్యాంకర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం రెండు ప్రాణాలను తీసింది. లారీ టైర్ల కింద పడిపోయిన బీటెక్ విద్యార్థిని.. నన్ను కాపాడండి అంటూ చేసిన ఆర్తనాదాలు కలచివేశాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని 15వ మున్సిపల్ వార్డు శ్రీనివాస కాలనీలో పెద్దషాపూర్ గ్రామానికి చెందిన మచ్చేందర్(48) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. మచ్చేందర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన కూతురు మైత్రి(21) వర్ధమాన కళాశాలలో బీటెక్ చదువుతోంది. రోజు మాదిరిగానే శనివారం మైత్రిని కాలేజీ కోసం బస్ ఎక్కించేందుకు మచ్చేందర్ ద్విచక్ర వాహనంపై షాద్నగర్ బస్ డిపోకు వెళ్తుండగా పట్టణ ముఖ్య కూడలిలో ఓ ట్యాంకర్ లారీ వేగంగా ఢకొీట్టింది. దీంతో ద్విచక్ర వాహనం లారీ కిందికి వెళ్లింది. తండ్రి, కూతురిపై నుంచి లారీ టైర్లు వెళ్లడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. లారీ కింద కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇరువురిని బయటికి తీసే లోపే మైత్రి అక్కడికక్కడే మృతిచెందింది. మచ్చేందర్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.
కాపాడండి అన్నా.. అంటూ వేడుకోలు
లారీ టైర్ల కింద నలిగిన విద్యార్థిని మైత్రి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ.. కాపాడండి అన్నా.. అంటూ అక్కడున్న వారిని వేడుకుంది. ఆ హృదయవిదారక ఘటనను చూసి అక్కడున్న వారంతా చలించిపోయారు. ఆమెను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మరోవైపు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మచ్చేందర్ కూతురిని చూసి తీవ్రంగా రోదించారు. కొన్ని నిమిషాల ముందు ఇంట్లో కండ్ల ముందు ఉన్న భర్త, కూతురు రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోవడంతో భార్య తట్టుకోలేక బోరున విలపించింది. మృతదేహాలను స్వగ్రామానికి తరలించినట్టు కుటుంబీకులు తెలిపారు.
షాద్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం
- Advertisement -
- Advertisement -