సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణ వేగవంతం : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రెవెన్యూ శాఖ నుంచి వివిధ అవసరాల కొసం ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూముల వివరాలు, వినియోగం, ప్రస్తుతం వాటి పరిస్ధితి తదితర అంశాలపై సమగ్ర నివేదికను రూపొందించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అది óకారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాజెక్ట్ల కోసం రెవెన్యూ విభాగం వేలాది ఎకరాల భూములను ఇరిగేషన్, ఫారెస్ట్ తదితర శాఖలకు కేటాయించిందని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్ట్ల్లో మార్పులు జరగడంతో పాటు కొన్ని రద్దయ్యాయని చెప్పారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని లెక్కలు తేల్చాలని అధికారులకు సూచించారు. గడచిన 30 సంవత్సరాల్లో అటవీ శాఖకు రెవెన్యూ శాఖ కేటాయించిన భూమి ఎంత? అదేవిధంగా అటవీ శాఖ రెవెన్యూ శాఖకు కేటాయించిన భూమి ఎంత? అనే వివరాలను రెండు శాఖలు సమన్వయంతో ఒక నివేదికను తయారుచేయాలని సూచించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,138 ఎకరాల అటవీ భూమి కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే కేశవపురం త్రాగునీటి పథకం కోసం రెవెన్యూ శాఖ గతంలో అటవీశాఖకు 1,030 ఎకరాల భూమిని కేటాయించిందనీ, అయితే ఈ ప్రాజెక్ట్ రద్దయినందున సదరు భూమిని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు బదలాయింపునకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి, అటవీ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, పీసీసీఎఫ్, మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ భూముల కేటాయింపులపై లెక్కలు తేల్చండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES