గౌరీకుండ్: అహ్మదాబాద్ విమానప్రమాదం మరవక ముందే.. ఉత్తరాఖండ్లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. గౌరీకుండ్లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు. ఆర్యన్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం, ఆదివారం ఉదయం ఆర్యన్ ఏవియేషన్ కంపెనీ హెలికాప్టర్ 5.20 నిమిషాలకు కేదార్నాథ్ నుంచి భక్తులతో గుప్తకాశీ వెళ్తున్న క్రమంలో ఘటన జరిగింది. ఈ మేరకు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో బయలుదేరిన 10 నిమిషాలకే ఇది కూలిపోయింది. దీంతో పైలట్, ఓ చిన్నారితో పాటు ఏడుగురు ప్రయాణికులు చనిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, పోలీసులతో సహా అన్ని రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి.
ఆర్యన్ ఏవియేషన్ కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం
ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్ధామ్ యాత్ర కొనసాగుతున్న వేళ ఆర్యన్ ఏవియేషన్ కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం విధించింది. ఆదివారం ఆర్యన్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్కు బయలుదేరగా ప్రమాదం జరిగింది.
అంతకుముందు.. యాత్రకు వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా జూన్ 15, 16 తేదీల్లో ఈ ప్రాంతంలో చార్టర్, షటిల్ హెలికాప్టర్ కార్యకలాపాలను నిషేధించింది. తాజాగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో మరోసారి అప్రమత్తమైంది. అయితే.. ఈ ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు జరుపుతోంది. కేదార్నాథ్ లోయలో సమీపంలో హెలికాప్టర్ కార్యకలాపాలను, యూసీఏడీఏ కమాండ్-అండ్-కంట్రోల్ రూమ్ పనితీరును సమీక్షించడానికి నైపుణ్యం కలిగిన అధికారులను వెంటనే నియమించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏని ఆదేశించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కూలిన హెలికాప్టర్ ఏడుగురు మృతి
- Advertisement -
- Advertisement -