‘మా ‘షష్టిపూర్తి’ చిత్రానికి ఇంత క్రేజ్, గుర్తింపు లభించడానికి ప్రధాన కారణం ఇళయరాజా. ఆయన ప్రోత్సాహాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. ఇదే ఊపుతో మా ఆయి క్రియేషన్స్ బ్యానర్లో మరిన్ని మంచి సినిమాలు తీస్తాను. హీరోగా, నిర్మాతగా చాలా వద్ధిలోకి వస్తావని ఆయన నన్ను మనస్పూర్తిగా ఆశీర్వదించారు. ఇంతకన్నా నాకేం కావాలి’ అని హీరో, నిర్మాత రూపేష్ ఆనందం వ్యక్తం చేశారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో మా ఆయి క్రియేషన్స్ బ్యానర్ పై రూపేష్ నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 30న విడుదలై, విశేష ప్రజాదరణతో బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇళయరాజా పుట్టిన రోజు సందర్భంగా చెన్నై వెళ్లి మరీ ఆయనకు ‘షష్టిపూర్తి’ బందం శుభాకాంక్షలు తెలియజేసింది. ఇళయరాజాకు రాజేంద్ర ప్రసాద్ పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ”ఏప్రిల్ 1 విడుదల’, ‘ ప్రేమించు పెళ్ళాడు’ చిత్రాల్లోని పాటల్ని పాడితే, ‘బాగా పాడుతున్నావ్ ప్రసాద్’అని మెచ్చుకున్నారు. ఈ సినిమాకి ఇంత గుర్తింపు రావడానికి కూడా ఇళయరాజానే కారణం’ అని అన్నారు. రాజేంద్ర ప్రసాద్, రూపేష్, పవన్ ప్రభ, పాటల రచయిత చైతన్య ప్రసాద్, కెమెరామెన్ రామ్తో ఇళయరాజా ముచ్చటించి, ‘షష్టిపూర్తి’ లాంటి మంచి ప్రయత్నం చేసినందుకు అభినందించారు.