Sunday, June 22, 2025
E-PAPER
Homeమానవిఆమె పాట ప్ర‌శ్నిస్తోంది

ఆమె పాట ప్ర‌శ్నిస్తోంది

- Advertisement -

మహి… పాటలను వినోదం కోసం పాడడం లేదు. డబ్బు కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో అంతకన్నా కాదు. తన జాతికి ప్రాతినిధ్యం వహించేందుకు గొంతు విప్పింది. ఆదివాసీ జీవితాలను పాటగా మార్చి లైవ్‌ షోస్‌ ద్వారా అవగాహన కల్పిస్తోంది. అణిగి మణిగి ఉండే ఆకుల వెనుక బడబాగ్ని దాగివుంటుందని రుజువు చేస్తోంది. అమాయకంగా అందరినీ ఆదరించే అడవి బిడ్డల భూమిని లాక్కుంటూ ఇదే అభివృద్ధి అంటే సహించేదే లేదంటోంది. ‘మా ఆదివాసీల గురించి నేను కాక ఇంకెవరు పాడతారు’ అంటూ ప్రశ్నిస్తున్న ఆ అడవి బిడ్డ పాటల ప్రయాణం గురించి క్లుప్తంగా.
ముంబై నగరానికి సమీపంలోని కళ్యాణ్‌ ప్రాంతంలో పుట్టి పెరిగిన మహి పూర్తి పేరు మధుర యశ్వంత్‌ ఘనె. తాను పెరిగిన పట్టణం గురించి తప్ప అంతకు మించి ఆమెకు ఏమీ తెలియదు. అప్పుడప్పుడు మహారాష్ట్రలోని తన స్వగ్రామమైన కలాన్‌కు వెళ్లివచ్చేది. అది మహదేవ్‌ కోలి అనే గిరిజన తెగ నివసించే ప్రాంతం. అందమైన అడవికి, ఆదివాసీ సమాజానికి నిలయం. ఆ తెగకు చెందిన వారిలో బడి చదువు పూర్తి చేసిన వారు ఎవ్వరూ లేరు. అలాంటి చోట చదువుకున్న మొదటి తరం ఆమె, ఆమె తమ్ముడు మాత్రమే. ఆ ఇద్దరూ ఇంజనీరింగ్‌ పూర్తి చేయగలిగారు. ఆదివాసీ సమాజాలలో ఆర్థిక భద్రత అత్యంత అవసరం. తమ బతుకులు బాగుపడాలన్నా, సమాజంలో గౌరవంగా బతకాలన్నా చదువే మార్గం అని ఆమె తల్లి దండ్రులు భావించారు. అందుకే పిల్లల్ని తీసుకొని ముంబైకి వలస వచ్చారు. అయితే చదువుకుంటూ ఆమె తన ప్రాంతానికి దూరంగా గడిపినా వారి సమస్యలను మాత్రం విడిచిపెట్టలేదు.
మార్పును గ్రహించింది
‘నీకు అవసరమైనది మాత్రమే నువ్వు తీసుకో. దేనికోసం ఎక్కువ వెంబడించకుండా ప్రశాంతంగా జీవించు. పర్యావరణానికి అనుగుణంగా మెలుగు. ఇది నేను నా తల్లిదండ్రుల నుండి అలవాటు చేసుకున్నా. నా తండ్రి ఒక బస్‌ కండక్టర్‌, ఆయనపై ఆధారపడిన వాళ్లు ఇంట్లో చాలా మంది ఉన్నాం. కానీ ఒక్కసారి కూడా మాకు పలానావి తక్కువగా ఉన్నాయని అనిపించలేదు. ఉన్నదాంట్లోనే ఎలా సర్దుకు పోవాలో మాకు తెలుసు’ అని 27 ఏండ్ల మహి ఓ వెబ్‌సైట్‌తో పంచుకుంది. చాలా కాలం తర్వాత ఆదివాసీ సమాజాలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఆమె గ్రహించింది. ఒకప్పుడు స్వయం సమృద్ధిగా ఉండేవారు. వనరులు వారికి అందుబాటులో ఉండేవి. ‘వారి భూమితో వారికి మంచి సంబంధం ఉండేది’ అని ఆమె అంటోంది.
రైతులకు మద్దతుగా…
ఎలక్ట్రానిక్‌, కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ చదివిన కళాశాలలో మహి మొదటి సారి ర్యాప్‌ పాటలు విన్నది. ఆ పాటలు ఆమెను ఎంతో ఆకర్షించాయి. కాలేజీ రోజుల్లో మహికి సంగీతం కంటే కవిత్వంలోనే ఆసక్తి ఉండేది. ‘నేను ఒక కవిత రాసి స్నేహితులకు చూపించాను. వారు దాన్ని ఎంతో ఇష్టపడ్డారు. స్ఫూర్తిదాయకంగా, శక్తివంతంగా ఉందన్నారు’ అని పంచుకుంది. 2021లో ఢిల్లీలో రైతుల నిరసనలు ఉదృతంగా సాగుతున్న సమయంలో ఆమె తన మొదటి ర్యాప్‌ను రాసింది. అది సుమారు పది నుండి పన్నెండు పంక్తులు. 25 ఏండ్లలోపు యువతను అంటే భారతదేశ జనాభాలో దాదాపు సగం మందిని ఆ పన్నెండు లైన్లు ఆలోచించేలా చేశాయి. ఇలాంటివి యువతను సామాజిక, రాజకీయ సమస్యల గురించి ఆలోచించ చేస్తాయని ఆమె గుర్తించింది.
కూల్చడమే అభివృద్ధా…
కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలో మహి తన గిరిజన ప్రజలతో నివసించడానికి తన గ్రామానికి వెళ్ళింది. అక్కడి ప్రజలు రోజూ ఎదుర్కొనే కష్టాలు, వలసలు, పారిశ్రామిల వల్ల ఏర్పడ్డ కాలుష్యం, కూలీ పనులు దొరక్క పడుతున్న కష్టాలు, తమ సంస్కృతి, భూమిని కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటం లాంటివి ఎన్నో ఆమె గమనించింది. ‘అడవులను కోల్పోవడం అభివృద్ధిగా భావిస్తున్నారు. కానీ అడవిని తమ ఇల్లు అని పిలవని వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. మీ తరతరాల ఇంటిని మీ కండ్ల ముందు నేలమట్టం చేసి, దాన్ని ‘అభివృద్ధి’ అని పిలిస్తే ఎలా ఉంటుంది. ఆదివాసీ ప్రజలు అడవిలోని మొక్కలు, జంతువులను తమ రక్తసంబంధంగా భావిస్తారు. అడవిలోని తేనె, మూలికలను సేకరించడం ద్వారా స్వయం ఉపాధి పొందుతారు. వారు అడవి రాజులు. వీటిని కాదని రోజువారీ కూలీ చేసుకుంటే వారు బానిసలుగా మారినట్టే’ అంటుంది ఆమె.
ప్రశ్నించే పాటల
మహి తన పాటల్లో సామాజిక స్పృహ ఉండాలని కోరుకుంది. అదే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. ‘కనిపించే వాటిని చూస్తూ కూడా అంధుడిగా మారకు…’, ‘ఎవరి చెమటతో నీ ఇల్లు పూర్తవుతుందో వారు ఏ దిక్కూ లేకుండా తిరుగుతున్నారు చూడు…’ ‘బేటీ బచావో ఎప్పటి వరకు.. ఆడపిల్లలను ఎందుకు కాపాడాలి… కాపాడాల్సిన అవసరమే లేని సమాజాన్ని నిర్మించలేమా…’ అంటూ ప్రశ్నలను సంధిస్తాయి ఆమె పాటలు. ఆమె రాసిన మరో పాట హక్‌ సే హిజ్దా హన్‌ అనేది ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీకి చెందినది. వారి జీవితాలను ఇందులో కండ్లకు కట్టినట్టు తెలియజేసింది. దీని కోసం మహి ఆ కమ్యూనిటీలోని వ్యక్తులను సంప్రదించింది. హమ్సఫర్‌ ట్రస్ట్‌తో కలిసి తన మాటలు ట్రాన్స్‌ హక్కుల ప్రతినిధిగా ఉండేలా చూసుకుంది. అలాగే బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ గురించి బాప్‌మానుస్‌ అనే పాటను కూడా విడుదల చేసింది. దీన్ని ఆమె న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రదర్శిస్తే మంచి స్పందన వచ్చింది.
మార్పు కోసం
ఆమె తన సంగీత ప్రయాణాన్ని చాలా నెమ్మదిగా కొనసాగించింది. విజయాల కోసం తొందరపడలేదు. ‘తొందరగా ఎదగాలనుకోవడం సహజం. అయితే నా సంగీతంలో నిజ జీవితాలు చూపాలని, మన సమాజంలోని పాత తరాలకు చేరువ కావాలి. వారికి తిరిగి పోరాడే అవగాహన, స్వరం లేని వారికి స్వరాన్ని ఇవ్వాలి. అందుకే నా పాటలకు సోషల్‌ మీడియాలో అభిప్రాయాలు అడగడం లేదు. దీనికంటే కూడా ప్రజల్లోకి ప్రత్యక్షంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. వారిలో కొంత మార్పు తెచ్చేందుకు ఉపయోగపడాలను కుంటున్నాను’ అంటూ ఆమె తన మాటలు ముగించింది.
జంగిల్‌ కా రాజా
తన గ్రామంలోని పరిస్థితులు చూసిన తర్వాత ఆమె తన తొలి పాటను రాసింది. అదే జంగిల్‌ కా రాజా (కింగ్‌ ఆఫ్‌ ది జంగిల్‌). మరాఠీ రాపర్‌, గాయకుడు, పాటల రచయిత రాప్‌బాస్‌తో కలిసి నిర్మించిన ఈ పాట మహారాష్ట్రతో పాటు చుట్టుపక్కల పర్యావరణ విధ్వంసం, అటవీ నిర్మూలనను నిరసించింది. ఈ వీడియోలో మహి అమ్మమ్మ వేషధారణతో గ్రామ ప్రజలకు కనిపించింది. ఆదివాసీల గుర్తింపును, భూమితో వారి సంబంధాన్ని ఇందులో హైలెట్‌ చేసింది. ఈ పాట ఎంతో వైరల్‌ అయింది. దాంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -