8 వికెట్లతో భారత్ ఘన విజయం
3-0తో టీ20 సిరీస్ హర్మన్సేన వశం
నవతెలంగాణ-తిరువనంతపురం : భారత్, శ్రీలంక మహిళల టీ20 సిరీస్లో వేదిక మారినా.. ఫలితంలో మార్పు లేదు. విశాఖపట్నంలో వరుస విజయాలు సాధించిన టీమ్ ఇండియా శుక్రవారం తిరువనంతపురంలోనూ అదే ప్రదర్శన పునరావతం చేసింది. బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణించటంతో శ్రీలంకతో మూడో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక అమ్మాయిలు నిర్దేశించిన 113 పరుగుల లక్ష్యాన్ని టీమ్ ఇండియా 13.2 ఓవర్లలోనే ఊదేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (79 నాటౌట్, 42 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ అర్థ సెంచరీతో వీర వీహారం చేసింది. స్మతీ మంధాన (1), జెమీమా రొడ్రిగ్స్ (9) నిరాశపరిచినా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (21 నాటౌట్, 18 బంతుల్లో 2 ఫోర్లు)తో కలిసి షెఫాలీ వర్మ లాంఛనం ముగించింది. షెపాలీ వర్మ దూకుడుతో పవర్ప్లేలో 55 పరుగులు చేసిన భారత్ ఓ వికెట్ కోల్పోయింది. ఫీల్డింగ్ పరిమితులు ముగిసినా..షెఫాలీ దండయాత్ర కొనసాగింది. 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 బంతుల్లోనే షెఫాలీ వర్మ అర్థ సెంచరీ సాధించింది. యువ ఓపెనర్ ధనాధన్ జోరుతో మరో 40 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో రెండు మ్యాచ్లు ఉండగానే దక్కించుకుంది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళలు 20 ఓవర్లలో 7 వికెట్లకు 112 పరుగులు చేశారు. పేసర్ రేణుక సింగ్ (4/21), స్పిన్నర్ దీప్తి శర్మ (3/18) వికెట్ల వేటలో రాణించారు. శ్రీలంక తరఫున ఇమేశా దులాని (27),హాసిని పెరీరా (25), కవిష దిల్హరి (20) ఆకట్టుకున్నారు. నాలుగు వికెట్లతో మెరిసిన రేణుక సింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది.
షెఫాలీ సూపర్ షో
- Advertisement -
- Advertisement -



