Friday, May 30, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌నకు షాక్‌

ట్రంప్‌నకు షాక్‌

- Advertisement -

– సుంకాలు చట్టవిరుద్ధమంటూ అమెరికా వాణిజ్య న్యాయస్థానం తీర్పు
– అధికారాన్ని అతిక్రమించారని ఆగ్రహం
– టారిఫ్‌ పెంపును తక్షణం నిలిపివేస్తూ ఆదేశాలు
న్యూయార్క్‌:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు వాణిజ్య న్యాయస్థానంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పలు దేశాలపై ఆయన విధించిన సుంకాలు చట్టవిరుద్ధమైనవంటూ న్యాయస్థానం బుధవారం తీర్పు చెప్పింది. వాణిజ్య భాగస్వాములపై ఏకపక్షంగా దిగుమతి సుంకాలు విధించి అధికారాన్ని అతిక్రమించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుంకాల పెంపును తక్షణమే నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజులలో స్పందించాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. న్యూయార్క్‌లోని అంతర్జాతీయ వాణిజ్య కోర్టు ఈ కీలక తీర్పు వెలువరించింది. ఇతర దేశాలతో వాణిజ్యాన్ని నియంత్రించడానికి అమెరికా రాజ్యాంగం ప్రతినిధి సభకు విస్తృత అధికారాలు కట్టబెట్టిందని, అయితే అధ్యక్షుడు తన అత్యవసర అధికారాలను ఉపయోగించి వాటిని తోసిపుచ్చలేరని తెలిపింది. సుంకాల విషయంలో అధ్యక్షుడు తన విశేషాధికారాన్ని ఉపయోగించుకోవడాన్ని చట్టం అనుమతించదని ముగ్గురు న్యాయమూర్తులతో ఏర్పడిన ప్యానల్‌ స్పష్టం చేసింది. దేశాధ్యక్షుడికి ఉన్న పరిజ్ఞానం, సమర్ధతపై తామేమీ వ్యాఖ్యానించబో మని, అయితే చట్టం అనుమతించనందున వాటిని ఉపయోగించుకోవడాన్ని అనుమతించలేమని తెలిపింది.ఈ తీర్పు అమలులోకి వచ్చిన పక్షంలో… వాణిజ్య భాగస్వాముల నుండి రాయితీలు పొందడా నికి సుంకాలు విధించాలన్న ట్రంప్‌ అంతర్జాతీయ వాణిజ్య వ్యూహం బెడిసికొడుతుంది. యూరోపియన్‌ యూనియన్‌, చైనా, ఇతర దేశాలతో జరుపుతున్న చర్చల ప్రక్రియపై అనిశ్చితి ఏర్పడుతుంది.
ఇంటర్నేషనల్‌ ఎమర్జెన్సీ ఎకనమిక్‌ పవర్స్‌ యాక్ట్‌ (ఐఈఈపీఏ) కింద జనవరి నుండి ట్రంప్‌ విధించిన టారిఫ్‌ ఆదేశాలను న్యాయస్థానం కొట్టివేసింది. అరుదైన, అసాధారణ జాతీయ అత్యవసర పరిస్థితులను చక్కబెట్టడానికి ఈ చట్టాన్ని ఉద్దేశించారు. ఉక్కు, ఆటోలు, అల్యూమినియం వంటి నిర్దిష్ట పరిశ్రమలను లక్ష్యంగా చేసుకొని ఇతర చట్టాల కింద ప్రవేశపెట్టిన సుంకాలను న్యాయస్థానం తన తీర్పులో ప్రస్తావించలేదు. కాగా వాణిజ్య న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ దానికి వ్యతిరేకంగా అప్పీలు చేసింది. వాణిజ్య అసమానతలు సంక్షోభానికి దారితీస్తాయని శ్వేతసౌధం ప్రతినిధి కుష్‌ దేశారు తెలిపారు. జాతీయ అత్యవసర పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నిర్ణయించే పని ఎన్నుకోబడని న్యాయమూర్తులది కాదని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా పరిశ్రమను, భద్రతను పరిరక్షించేందుకు ట్రంప్‌ జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాలను ఆయన సమర్ధించారు. కాగా న్యాయమూర్తులను దేశాన్ని పాలించిన డెమొక్రాట్‌, రిపబ్లిక్‌ అధ్యక్షులు నియమించారని అల్‌ జజీరా వార్తా సంస్థ ప్రతినిధి తెలిపారు. తమకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన ఇతర కోర్టులను కూడా ట్రంప్‌, ఆయన సన్నిహితులు గతంలో నిందించారని అల్‌ జజీరా ప్రతినిధి గుర్తు చేశారు. తీర్పు చెప్పిన ముగ్గురు న్యాయమూర్తులలో ఒకరిని ట్రంప్‌, రెండో వారిని మాజీ అధ్యక్షుడు ఒబామా, మూడో జడ్జిని మరో మాజీ అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ నియమించారని గుర్తు చేశారు. అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం కస్టమ్స్‌, వాణిజ్య చట్టానికి సంబంధించిన అంశాలను విచారిస్తుంది. దాని తీర్పులను ఫెడరల్‌ సర్య్యూట్‌లోనూ, సుప్రీంకోర్టులోనూ సవాలు చేయవచ్చు. రెండు వ్యాజ్యాలపై వాణిజ్య కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఐదు చిన్న చిన్న వ్యాపార సంస్థల తరఫున లిబర్టీ జస్టిస్‌ సెంటర్‌ ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఈ సంస్థలు సుంకాలను ఎదుర్కొంటున్న దేశాల నుండి వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇక అమెరికాలోని 12 రాష్ట్రాలు రెండో వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. సుంకాల ఆదేశాలు ఫిర్యాదుదారులకు చట్టవిరుద్ధమైతే అవి అందరికీ చట్టవిరుద్ధమేనని, అందులో ఎలాంటి ఉపశమనం లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కాగా సుంకాలను సవాలు చేస్తూ మరో ఐదు వ్యాజ్యాలు కోర్టులో పెండింగులో ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -