ఆస్ట్రేలియా పర్యటనకు జట్టు ప్రకటన
రోహిత్, కోహ్లి పునరాగమనం
ముంబయి: అజిత్ అగర్కార్ సారథ్యంలోని బిసిసిఐ సెలెక్షన్ కమిటీ ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా జట్లను ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా భారతజట్టు ఆసీస్తో మూడేసి వన్డే, టి20ల్లో తలపడనుంది. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి టీమిండియా వన్డే జట్టులో చోటు దక్కించుకోగా.. వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యారు. ఇప్పటివరకు వన్డే జట్టు వైస్ కెప్టెన్గా ఉన్న శుబ్మన్ గిల్.. రెగ్యులర్ కెప్టెన్గా ప్రమోషన్ పొందాడు. రోహిత్ శర్మ స్దానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. అయితే గిల్ కంటే కెప్టెన్గా అనుభవం ఎక్కువగా ఉండడంతో శ్రేయస్కు భారత వన్డే జట్టు పగ్గాలను అప్పగిస్తారని ఊహించినా.. సెలెక్టర్లు శుభ్మన్ గిల్వైపే మొగ్గారు. మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండాలనే ఉద్దేశ్యంతో అజిత్ అగార్కర్ అండ్ కో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే నిజమైతే త్వరలో టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై కూడా వేటు వేసే అకాశముంది.
శ్రేయస్కు వైస్ కెప్టెన్సీ..
బిసిసిఐ సెలెక్షన్ కమిటీ మరో సంచలనాన్ని తెరలేపింది. శ్రేయస్ అయ్యర్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. దేశవాళీ క్రికెట్లో ముంబయి జట్టుతో పాటు ఐపిఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ టీమ్స్ను విజయ పథంలో నడిపించిన ట్రాక్ రికార్డు శ్రేయస్ సొంతం. అయ్యర్ సారథ్యంలో కెకెఆర్ ఐపిఎల్-2024 ఛాంపియన్స్ నిలిచింది. ఐపిఎల్-2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ను రన్నరప్గా నిలిపాడు. వైట్బాల్ క్రికెట్లో గత కొంత కాలంగా అయ్యర్ దుమ్ములేపుతున్నాడు. భారత జట్టు తరపున అయ్యర్ కెరీర్ ముగిసిందని అంతా భావించారు. బిసిసిఐ తమ ఆదేశాలను ధిక్కరించడంతో జట్టుతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరిచి తిరిగి జట్టులోకి వచ్చాడు.
28ఏళ్ల అయ్యర్ వన్డే ప్రపంచకప్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో 11 మ్యాచ్లు ఆడి ఏకంగా 530 పరుగులు చేశాడు. దీంతో బిసిసిఐ కాంట్రాక్ట్ను తిరిగి సంపాదించుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత్ నిలవడంలో అయ్యర్ది కీలక పాత్ర. అతను ఐదు మ్యాచ్లలో 243 పరుగులు సాధించి టోర్నీలో భారత తరపున లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ తర్వాత అయ్యర్ను వన్డే కెప్టెన్గా ఎంపిక చేయాలని చాలా మంది మాజీలు సూచించారు. కానీ సెలక్టర్లు మాత్రం వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆసీస్ టూర్ నుంచి కొత్త రోల్లో శ్రేయస్ కన్పించనున్నాడు.
వన్డే జట్టు: శుభ్మన్(కెప్టెన్), రోహిత్ శర్మ, జైస్వాల్, కోహ్లి, శ్రేయస్(వైస్ కెప్టెన్), అక్షర్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్(వికెట్ కీపర్లు), నితీష్ కుమార్, సుందర్, కుల్దీప్, హర్షిత్, సిరాజ్, అర్ష్దీప్, ప్రసిధ్ కృష్ణ,
టి20 జట్టు: సూర్యకుమార్(కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్మన్(వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, దూబే, అక్షర్, శాంసన్, జితేష్(వికెట్ కీపర్లు), వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్దీప్, కుల్దీప్, హర్షిత్ రాణా, రింకు సింగ్, సుందర్.