జ్యుడీషియల్ రిమాండుకు తరలింపు
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
నవతెలంగాణ-పటాన్చెరు
రియాక్టర్ పేలి 54 మంది కార్మికులు మృతి చెందిన సిగాచి పరిశ్రమ సీఈవో అమిత్ రాజ్ సిన్హాను పటాన్ చెరు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ ఏడాది జూన్ 30వ తేదీన పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించి 54 మంది కార్మికులు మరణించిన విషయం తెలిసిందే. అంతా సజీవ దహనమయ్యారు. వారిలో కొంత మంది ఆచూకీ నేటికి లభ్యం కాలేదు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు.. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగి దాదాపుగా కొన్ని నెలలు కావస్తున్నా.. నేటికి సిగాచి పరిశ్రమ సీఈవో అమిత్ రాజ్ సిన్హాను అరెస్ట్ చేయకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పరిశ్రమ యజమాన్యంపై పరిశ్రమలో సంభవించిన అగ్ని ప్రమాదం ఘటనపై సంగారెడ్డి జిల్లా బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెం.184/2025, దీచీూ సెక్షన్లు 105, 110, 118(1), 118(2) ప్రకారం కేసు నమోదు అయింది. అయినా యాజమాన్య ప్రతినిధులను అరెస్టు చేయకపోవడంతో ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాయి. మంత్రులు, ముఖ్యమంత్రిపై కూడా విమర్శలు రావడంతో ఎట్టకేలకు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈనెల 27వ తేదీ శనివారం రాత్రి నిందితుడైన సిగాచి పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమిత్ రాజ్ సిన్హా ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండుకు తరలించినట్టు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.



