Sunday, June 29, 2025
E-PAPER
Homeసందర్భంకవితా భిషక్కు 'సీతారాం'

కవితా భిషక్కు ‘సీతారాం’

- Advertisement -

బడిగంటకు పిల్లలు పరుగెత్తినట్లు కవిత్వ స్పర్శ తగిలితే చాలు ఉప్పొంగిపోతాడు సీతారాం. గుడిముందు ధ్వజస్తంభంలా! నిలువెత్తు అక్షర శిఖరమై నిలబడుతాడు. పిల్లలతో మైమైకపోతాడు సంభాషిస్తాడు. ఆలోచనలకు అంటుగడ్తాడు. పిల్లలకు గులాబీ ఎంతిష్టమో సీతారాం కూడ అంతే యిష్టం. చందమామలా విద్యార్థులను ఆకర్షిస్తాడు. క్షణాల్లో బాలకవులతో బాలోత్సవ ఊరేగింపులు. అతడెక్కడుంటే అక్కడ కొత్త కవిత్వానికి జీవం పోస్తాడు. కవితకు కాళ్ళొస్తాయి మానవతావాది. హస్యం వ్యంగ చతురత ఎక్కువ. కుదురుగా నిలువడు కూర్చోనివ్వడు. కవిత్వానికి అలంకార కలంకారై నడక నేస్తాడు.
సీతారాం వున్నచోట కోలాహలం. నిరాడంబరత్వం మితభాషి.అంచనాకు అందని మదుభాషి. రావులపాటి సీతారాం ఆధునిక తెలుగు సాహిత్యంతో నాలుగు దశాబ్దాలు విమర్శకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, తెలుగు అధ్యాపకుడిగా పేరొందాడు.


కళాశాలలో ఒకవైపు విద్యార్థులకు బోధిస్తూనే తెలుగు కవిత్వాన్ని కూడా అదనంగా చొప్పించి బోధిస్తాడు. విద్యార్థులను కవులను చేయడమే తన లక్ష్యం.. విద్యార్థుల కవితల్లోని ఆర్దత కలిగిన వాక్యాలను విరివిగా ప్రచారం చేస్తాడు. పసి హదయాల్లోని సజనాత్మకతకు లేపనం
పూస్తాడు.సీతారాం కవిత్వ పద్దతులను తరగతి గదిలో వింటే ఒకసారి వింటే కవులై కదిలిపోతాం. ఆయన గొప్ప భావుకుడే కాదు గొప్ప విమర్శకుడు మానవతావాది తన విమర్శన వ్యాసాలు ”అదేపుట”రచనా పుస్తకాన్ని ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారికి, నివారణకై నిరంతరం పరితపిస్తున్న వారికి అంకితం ఇచ్చాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అతని మానవతా హదయాన్ని.


1985 ‘రక్తస్పర్శ’ కవితాసంపుటితో సీతారాం సాహితీలోకానికి పరిచయమయ్యారు. అఫ్సర్‌, ప్రసేన్‌ లతో కలిపి సీతారాం ఈ కవితా సంపుటిని వెలువరించారు. ఈ కవితా ఒక సంచలనం సష్టించింది 1990 ”ఇదిగో ఇక్కడిదాకా” పేరుతో ఆయన వెలువరించిన కవితాసంపుటి సంచలనం సష్టించింది. 1995లో సన్నాఫ్‌ మాణిక్యం కవితాసంకలనం ఆయనకు మంచి పేరుప్రతిష్ఠలను తీసుకొచ్చింది. 2007లో ”అదేపుట” సాహిత్య విమర్శన వ్యాసాలను తీసుకొచ్చాడు.2008లో కుప్పం కవిత్వ సంపుటి,2009లో ఆ ముగ్గురు సరే-మన మాటేమిటి (వ్యాస సంపుటి) 2011లో కారేపల్లి కబుర్లు (డిగ్రీ విద్యార్థుల చదువులపై) ఆధునిక కవితా ధోరణులు అనే అంశంపైన ఆయన పరిశోధన చేశారు. 2014మానుకోటలో డిగ్రీ కాలేజీ విద్యార్థులతోనే రచనలు చేయించి విద్యార్థులలోని సజన్మాతకతకు పదునుపెట్టారు. మానుకోట ముచ్చట్లు విద్యార్థులను ప్రోత్సహించే ఆయన ఉన్నత లక్షణానికి ఉత్తమ అధ్యాపకత్వానికి తార్కాణాలు…


సీతారాం కవిత్వం చదువుదామని ఎప్పటినుంచో వెతుకుతున్నాను. నా దగ్గర ఆయన కవిత్వ పుస్తకాలు లేకపోవడం నా బాధ్యతా రాహిత్యం. ఆయన పుస్తకాలకై అన్వేషణ ప్రారంభించినా నా దగ్గర లేవంటున్నారు. ఎక్కడ దొరకడం లేదు. ఆ సందర్భంలోనే మా గురువుగారు నాగవరం బాల్‌ రాం ఒకరోజు హైదరాబాద్‌ ఆబిడ్స్‌ పుట్‌ ఫాత్‌ పై పాత పుస్తకాల షాపులో సన్నాఫ్‌ మాణిక్యం పుస్తకం కనబడితే అది తెచ్చి నాకిచ్చాడు. నేను పుస్తకం తెరిచి మొదలుగా చదివిన కవిత సన్నాఫ్‌ మాణిక్యం.చదువుతుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు.అమ్మ శ్రామిక పతాకం పేదరికాన్ని గుండెల్ని కోసేసే కవిత సీతారాం తప్ప మరెవరు రాయలేరేమో నన్న సందేహం నాకు కలిగింది.అదొక అద్భుతమైన కవిత.


ఇందులోని ఏ కవితలు చదివినా ఒక్కొక్క కవితను దాటివెళ్లలేని స్థితి. కవిత్వం ఎలా రాయాలో రాసేవారు సన్నాఫ్‌ మాణిక్యాన్ని చదువుతే తెలుస్తోంది……
టైటిల్‌ కవిత. సన్నాఫ్‌ మాణిక్యం..
మరేనే నా చాలా చిన్నప్పుడు/ చిన్నతనం కూడా ఉండేదేమో/ ఓ అప్పుడు కదా! ఒక చొక్కా జేబులోంచి/ రూపాయి నన్ను చూసి అపహరించింది/ నడుచుకుంటూ వచ్చి నన్ను దొంగిలించింది/ నేరం చేసిన రూపాయికి శిక్ష పడకుండా / కిటికీ రేకుల వెనకాల దాచాను ఎవరూ చూడకుండా/ రూపాయికి చెప్పులు వస్తాయా ఎక్కడైనా/ మూడు మైళ్ళు పోనూ రానూ/ చదువే, నా చెప్పులు లేని పాదాల సాక్షిగా/ నేను ఇప్పటికీ నిరపరాధినే/ కనిగిరి సిరిపురంలోనైనా/ రూపాయకి చెప్పులు అమ్ముతారా? /నావి మనిషి కాళ్ళే కనక/ ముళ్ళు కొట్టీ రాళ్లు తగిలీ/ ఎప్పుడైనా నెత్తురు కళ్ళజూడని రోజుందా/ అమ్మా! ఓకే అరుపు ముళ్ళు గుచ్చుకున్నప్పుడల్లా అరికాళ్ళలో ముళ్ళను పొదిగి నడిచిన మనిషిని నేనే/ మా అమ్మ ఎప్పుడొస్తుందో! నా నడిచే దారుల్లోని/ యిళ్ళని పూలుగా మారండని ఎప్పుడు శపిస్తుందో! ఆ దారినిండా నా నెత్తుటి చుక్కలే అరుద్ర పురుగుల్లాగా/ పాపాన్నో పుణ్యాల జాబితాని ఎవడు రాసిపెట్టాడు/ స్వర్గంలోకో లేక కలల్లోకో/ ఖాళీ కాళ్ళతో నడవాలంటే చెప్పు నువ్వు చెప్పు/ అంత కష్టం కాదా/ మా అమ్మ కాళ్ళకి సరిపోయే బంగారు చెప్పులు/ అమ్ముతారా కొంటానని కొంటూనే ఉన్నా /మా అమ్మకాళ్లకు సరిపోయే చెప్పులు అమ్ముతారా?………


అమ్మ ప్రేమ అమ్మ కాళ్ళకు చెప్పులు లేని బీదతనం రూపాయిని దొంగిలించినందుకు నేరం రూపాయదా తనదా అని ప్రశ్నిస్తాడు.రూపాయి తనను దొంగిలించిందంటాడు. చెప్పులు లేకుండా నడిచిన అమ్మ కోసం మా అమ్మ కోసం సరిపోయే చెప్పులు అమ్ముతారా? రూపాయకు చెప్పులు అమ్ముతారా అంటూ వీధులన్ని తిరుగుతూ మనుషుల కాళ్లకు చెప్పులులేని ఆర్థిక అభివద్ధి తనాన్ని నిలదీస్తాడు. సామాజిక వాస్తవికతను నిరసిస్తాడు. అమ్మ కాళ్ళకు చెప్పులు కొనివ్వలేకపోయాడు కానీ అమ్మకు విలువైన బహుమతిని తల్లి పేరునా సాహిత్య చరిత్రలో సన్నాప్‌ మాణిక్యం ఒక ఎవరెస్టు.
‘హరిత నవ్వు’ అనే మొదటి కవితలో… గుండెల్లోకి కాళ్లు విసిరి/ చిన్న చేతులతో/ వెన్నెల మట్టి కుప్పల్ని/ ఎగజిమ్ముతుంది/ ఎప్పుడైనా ఎక్కడైనా/ ఈ బతుకు మీదకి ఎవరైనా ఇలాంటి నవ్వు విసిరారా/ దుమ్ముల్లో ఆడుకుంటున్నప్పుడు/ చెవుల్లో ఆత్మల్లా నవ్వారా/ పళ్ళూ డిన అరణ్యంలా/ముసలి నదిలాగ నవ్వుతుందీ పిల్ల/ పచ్చటి ఆకుల మధ్య/ సూర్యుడు మరిచిపోయిన కిరణంలా/ఇదిక్కడే మిగిలి ఉందింకా…. చిట్టి చిట్టి చేతులతో మట్టికుప్పల్ని ఎగజిమ్మే బాల్య ప్రపంచాన్ని ఆవిష్కరించారు.


యూసఫ్‌ ఇంకా ఇంటికిరాలేదు మరొక కవితలో……
కర్ఫ్యూ మోకులు విప్పారు/ వీధులు విచ్చుకున్నాయి/ గొంతెండిన పంపులు/ నీళ్లను పుక్కిలించి ఉమ్ముతున్నాయి/ పాల సంచులు, ముక్క బియ్యం దొరుకుతూనే ఉన్నాయి/ కొమరయ్య తుపాకికీ అంటిన శవాన్ని తుడిచాడు/ ముప్పై తూటాల్లో మూడే మిగిల్చి /కంపెనీలో లెక్క అప్పగించాడు/ ఈ కొమరయ్య ఇరువయ్యేడు తూటాలు ఎక్కడెక్కడ నాటాడు/ కోస్తున్న శవాల్లోంచి /ఒకటీ అరా తూటాలు తొంగిచూస్తున్నారు/ అక్కడక్కడ దుకాణాలు/ ఒక రెప్ప మూసి ఒక రెప్ప తెరిచి చూస్తూనే ఉన్నాయి/ యూసఫ్‌ మాత్రం ఇంట్లో లేడు వాళ్ళ ఇంటికి వచ్చే దారిలో కూడా….. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్‌ కౌంటర్లతో తెల్లారుతున్న కాలం. కల్లోలిత ప్రాంతంగా ప్రకటించబడ్డది. కళాశాలలో చదువుతున్న విద్యార్థులు కళాశాలలోనే మాయం. నౌకర్లకు వెళ్లిన వాళ్ళు దారిలోనే మాయం. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎన్‌ కౌంటర్‌ అవుతారో… నిత్య నిర్బంధం. ఎవరు మాట్లాడలేని పరిస్థితి నిలదీస్తే నక్సలైట్‌ గా ముద్ర. స్వేచ్ఛకు దారిలేని పరిస్థితులు హక్కులను కాల్చేస్తూ ప్రజాస్వామ్యా కొల్లగడుతున్న వైనాన్ని తన కవితలో ప్రతిబింబించాడు


మానవుడు చనెను కవితలో….
మనిషిని నమ్మిన దార్శనికుడు/ చనిపోయెను/ ఒక ఆధిమానవుడ్ని స్వప్నించి శాసించి/ దేవుడ్నిచంపేను/ అవును దేవుడు మరణించెను/ మానవుడు మరణించెను/ కాలం వెనుదిరిగెను/ మున్నీరు కార్చెను/ కన్నీటిని ఏడ్చెను ఉక్కు పాదములు మొలిచెను… మనిషి నమ్మిన దేవుడే మరణించాక మనిషి పరిస్థితి ఏమిటంటాడు
సీతారాం ఎక్కడ పని చేస్తాడో అక్కడ ఆ అనుభవాల్ని ఒక పుస్తకంగా తెస్తారు. కవిత్వంగా రాస్తారు. అలా వచ్చిన కవితలే కుప్పం కవితలు గాయపడ్డ కవి. బాధపడ్డ కవి.కన్నీటిని తాగిన కవి. కుప్పం సామాజిక స్థితి వెనుకబాటుతనాన్ని రాయకుండా ఉండలేకపోయాడు. పలువరించకుండా ప్రచురించలేకుండా ఉండలేకపోయిన పుస్తకమే. కుప్పం కవితలు సంపుటి….


కుప్పం టైలర్‌ కవితలో…
చిరిగిపోయిన/ గుడ్డల్ని వాళ్ళలా కుడుతూనే ఉంటారు/అంతా నిద్రించాక/ రాత్రి చీకటినీ, పగటి వెలుతురినీ/ కలిపి కత్తిరించి కుట్టేస్తుంటారు/ ఒకరి వస్త్రాన్ని మరొకరికి/ కత్తిరించి కుట్టేయటమే వాళ్లకు తెలుసు/ గుడ్డ ఎవరిదన్నది కాదు/ కుట్టడం పూర్తయిందా కాలేదా? అదే ముఖ్యం/ కొత్త బట్టలు/ సరికొత్త కలలు/ నువ్వు వెయ్యి చెప్పు/ కుప్పంలో చొక్కా కుట్టించుకోవడం/ నీకు తెలుసా/ సైజు తెలియని జీవితాలు ఇవి/ అందరికీ ఒకే చొక్కా కుడుతాను/ అవతల బెంగుళూరు/ యివతల మదరాసు/ నాలా చొక్కాకుట్టగలిగిన టైలర్‌ని/ నేనొక్కణ్ణే…


వంటిపై చొక్కాలు లేని జీవితాలు పక్కనే మదరాసు బెంగుళూరు వెలుగులీనుతున్న మహానగరాలు చీకటిలో కుప్పం ఎలా కుంటుపడిందొ కుప్పం ధైన్యాన్ని అక్షరీకరించిన వైనాన్ని మన కళ్లముందుంచాడు.
సీతారంది వెంటాడే వాక్యం తలవొంచని తిరుగుబాటు హదయాల్ని తాకే ఉపన్యాసం. ప్రేక్షకుల్ని తన వైపుకు తిప్పుకునే సమ్మోహన శక్తి. వ్యంగ చతురుడు అలలు అలల్లా ఆలోచనలను పుట్టించే కడలి. అత్యంత ప్రతిభాశాలి.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని 14 గ్రామాలను దత్తత తీసుకుని హెచ్‌ఐవి నిర్మూలన కోసం విశేష కషిచేశాడు
ఎయిడ్స్‌ వ్యాధినివారణకై సామాజిక ఆవగాహన చైతన్యం కోసం కాళ్ళకు బలపం కట్టుకొని ఊరూర తిరిగాడు. పిల్లల జీవితాలు, చదువులు,కవిత్వం వేరువేరుగా చూడలేదు. తెలుగు సాహిత్యంలో సీతారాంది ప్రత్యేకమైన స్థానం. సన్నాఫ్‌ మాణిక్యమని సగౌరవంగా ప్రకటించుకున్న సీతారాం గారు నాకు ప్రీతిపాత్రులు. తెలుగు సాహిత్యాన్ని వడబోతతోపాటు ప్రపంచ సాహిత్యాన్ని కూడ క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. సీతారాం వంటి బోధకులు అధ్యాపకులు అక్కడక్కడ కనిపిస్తారు. ఒక చెలిమెలా ఒక గొడుగులా, ఒక చేయూతలా ఒక వారధిలా, ఒక ఊతకర్రలా ఒక ఆసరాలా అనునిత్యం విద్యార్థుల కరదీపికై కవితాన్వేషలో ప్రయాణిస్తాడు. అక్షర సిద్ధికై యజ్ఞుడై నిరంతరం యాత్రికుడై ఆలింగనం చేసుకుంటాడు. సభలలో కలిసినప్పుడు ఆత్మీయంగా ఒక సన్నని జాజిమల్లెలా చిరునవ్వుతో పలకరిస్తాడు. పసి హదయంలా అలరిస్తాడు. సీతారాం కవితల్ని అర్థం చేసుకోవడం కష్టమైన పని కానీ, అత్యద్భుతమైన కవితల్ని పిల్లలు చేత సష్టిస్తాడు. చిన్న చిన్న వాక్యాలను గులాబీ రెమ్మల్లా బంతిపూల వరస పేర్పులతో పరవశిస్తూ ప్రచారం చేస్తాడు. తెలంగాణ ఉద్యమ సమయం 2012 లో జులూస్‌ కవితాసంకలనం ఆవిష్కరణ కోసం సీతారాం గారిని నాగర్‌ కర్నూల్‌ కు ఆహ్వానించాం. ఆ కవితా సంపుటినే సమీక్షిస్తూ ఇలా మాట్లాడాడు. కాకినాడ కాజాల్లా ‘జులూస్‌’ని ఆంధ్ర ప్రాంతమంతా బండిమీద తిరిగి అమ్మాలన్న ప్రారంభోపన్యాస వాక్యాలకు,తాను మాట్లాడిన తీరుకు మేమంతా ఫిదాఅయిపోయాం.


మానుకోట ముచ్టట్లు’లో… విద్యావ్యవస్థల లోపాల్ని, కళాశాలలో టాయిలెట్ల దుర్గంధాన్ని, బాల్యవివాహాల్ని, అకారణంగా ఆడపిల్లల పెండ్లిళ్ళు చదువుకు నోచుకొని విద్యార్థుల్ని, అధ్యాపకుల బాధ్యతారాహిత్యాన్ని, విద్యార్థుల వికాసానికి తీసుకోవలసిన చర్యల్ని,వార్షిక పరీక్షల కష్టాల్ని, ఎదురీతల్ని పరీక్షల నిర్వహాణ నేడు భారంగా మారిన సందర్భాల్ని, టీచింగ్‌ డైరీ,ప్రయివేట్‌ కళాశాలలో విద్యార్థుల సందడిని, నీరసించిపోతున్న ప్రభుత్వ కళాశాలల దుస్థుతుల్ని,మహిళా సాధికారతల్ని విపులంగా ముచ్చట్లలో వివరించారు. ఒక ఐడియా చాలు జీవితం మారటానికి సెల్‌ ఫోన్‌ కంపెనీ అడుగడుగున ప్రచారం. సీతారాం మాటలలో ”ఒక ఐడియా చాలు బాగా చదువుకోవడానికి ఆ ఐడియా ఏమంటే చదవుకోవాలనుకోవటమే” మానుకోట ముచ్చట్లు విద్యార్థుల్నే కాదు అధ్యాపకులను కూడ సంస్కరణలకు పునాదులు వేస్తుంది.. సీతారాం తన మాట చివరలో మనం వ్యవస్థలకు బలహీనతగా మారకూడదు . బరువుగా ఉండకూడదు. మనకు ముందు నుంచీ వ్యవస్థ ఉంది. మన తర్వాత కూడా వ్యవస్థ ఉంటుంది. మనమున్న కాలంలో, స్థల, సందర్భాలలో ఇది పరిపూర్ణమైతే పరిపుష్టమైతే బోలెడంత సంతప్తి. మనవల్ల వ్యవస్థలు బలోపేతం కావాలి. పదవి హౌదా అంతస్తు హౌదాలను బట్టి పిల్లలను ఏరా అరేరు ఒరేరు అని పిలవకూడదు. అట్టడుగు వర్గం వారిని చులకనగా, తక్కువ పిలుపులతో ఆధిపత్యభాషతో కించపరచడాన్ని చూసి సీతారాం విలవిలలాడిపోయాడు. ”మానుకోట ముచ్చట్లు” విద్యార్థులు అధ్యాపకులు తమను తాము సంస్కరించుకునే కరదీపిక. ఈ పుస్తకానికి ప్రసిద్ధ రచయిత విమర్శకులు కవి ప్రసేన్‌ ముందుమాట మరొక సంచలనం ”సీతారాంలు నశించాలి” మనం ఏ వ్యవస్థలో మనుగడ సాగిస్తున్నామో ఆ వ్యవస్థను ధిక్కరించకపోతే ఆ వ్యవస్థ మనకు ఏమీ నేర్పలేదని అర్థం.
సీతారాంగారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రముఖ ప్రజాకవి కాళోజీ నారాయణరావు- 2017 పురస్కారం.


తెలంగాణ సరస్వత పరిషత్‌ నుంచి దేవులపల్లి రామానుజారావు సాహితీ పురస్కారం 2024, ఇంకా ఎన్నో ఎన్నెన్నో పుష్కారాలను పొందారు.వివిధ కళాశాల సాహిత్య సభల సెమినార్‌ లలో పరిశోధక పత్రాలను అందజేశారు
కవి సామాజిక వేత్త సాహితీవేత్త విమర్శకుడు అధ్యాపకుడు సీతారాం అసలు పేరు రావులపాటి సీతారాం 1964 లో ఖమ్మం జిల్లా ఆరెంపుల గ్రామానికి చెందిన నారాయణ, మాణిక్యం దంపతులకు జన్మించాడు. పదో తరగతి, డిగ్రి ఖమ్మంలో పూర్తి చేశాడు. ఏంఏ కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాడు. ఆధునిక తెలుగు సాహిత్యంలో డాక్టరేటు పట్టాను పొందారు. 1998లో ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలం లోని బనిగండ్ల పాడు జూనియర్‌ కాలేజీలో జూనియర్‌ లెక్చరర్‌ గా ఉద్యోగ జీవనం ప్రారంభించి ప్రస్తుతం ఖమ్మంలోని శ్రీరామ భక్త గెంటేల నారాయణ రావు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ (ూ=డ దీ+చీ= డిగ్రీ కాలేజ్‌) లో గత మూడు సంవత్సరాల నుండి అసోసియేట్‌ ప్రొఫెసర్‌ గా అధ్యాపకత్వం నిర్వహిస్తూ ఉద్యొగ జీవనంలో పదవి విరమణ పొందుతున్నారు.
సీతారాం! అతడు నిశ్శబ్దం. కదిలిస్తే సముద్రపు కల్లోలమే!


సామాజిక అసమానతల్ని నిలదీసే అనేక ప్రశ్నల కొడవలి. ఆ అక్షరాల పదును మానవ విధ్వంసాలపై సంధించే ఫిరంగులు! అతడు విశ్వమానవుడు ఏ పక్షుల గింజలు ఆ నోటికే అందించే సరికొత్త చూపు! ఎదురెక్కే చాపలకు కొత్త నీరు నూతన కలాలకు సిరా. పిల్లల్ని పరుగెత్తించే గిల్లి దండు
దారి తప్పిన పడవలకు చేయందించే దిక్సూచి, సన్నాఫ్‌ మాణిక్యం. తెలంగాణ ఆకాశానికి పూసిన చెంద్రవంక!
పదవి విరమణ ఉద్యోగానికే గానీ, సాహిత్య వికాసానికి కంచు కాగడై వెలుగులీనుతూనే ఉండాలని అశిస్తూ…
కవి సీతారాం జూన్‌ 30 న ఖమ్మం డిగ్రీ కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ గా ప్రభుత్వం ఉద్యోగ పదవీ విరమణ సందర్భంగా…..

– వనపట్ల సుబ్బయ్య, 9492765358

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -