అహ్మదాబాద్: కొండపై ఉన్న ఆలయం వద్ద కార్గో రోప్ వే తెగి ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది మరణించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గుజరాత్లోని పంచమహల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు శక్తిపీఠమైన పావగఢ్ కొండ ఆలయం వద్ద గూడ్స్ రోప్వే వైర్ తెగిపోయింది. కొండపైకి నిర్మాణ సామాగ్రిని తీసుకెళ్లడానికి ఉపయోగించే కార్గో ట్రాలీ కేబుల్స్ తెగిపోయాయి. దీంతో నాలుగో టవర్ నుంచి ట్రాలీ కిందపడింది.కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్టు పంచమహల్ కలెక్టర్ ధృవీకరించారు. మృతుల్లో ఇద్దరు లిఫ్ట్మెన్లు, ఇద్దరు కార్మికులు, మరో ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. సాంకేతిక బృందంతో ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతామని అన్నారు.మరోవైపు పావగఢ్ ఆలయం సుమారు 800 మీటర్ల ఎత్తులో ఉన్నది. 2,000 మెట్లు ఎక్కడం లేదా కేబుల్ కార్ల ద్వారా భక్తులు, యాత్రికులు శిఖరానికి చేరుకుంటారు. అయితే శనివారం ప్రతికూల వాతావరణం కారణంగా ప్రజలు ఉపయోగించే రోప్వేను మూసివేసినట్టు అధికారులు వెల్లడించారు.