శాన్ప్రాన్సిస్కో: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వేలాది మంది ఉద్యోగులపై వేటు వేయడానికి సిద్దమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బందిలో మూడు శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దాదాపు 6,000 మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. 2023లో 10,000 మందికి ఉద్వాసన పలికిన అనంతరం ఇదే రెండో అతిపెద్ద తొలగింపు కానుంది. మైక్రోసాఫ్ట్లో 2024 జూన్ నాటికి 2.28 లక్షల మంది సిబ్బంది పని చేస్తోన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా పనితీరు ఆధారంగా పలువురు ఉద్యోగులను సంస్థ తొలగించిన విషయం తెలిసిందే. మార్కెట్లో పైచేయి సాధించేలా సంస్థను ఉత్తమంగా ఉంచేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేస్తూనే ఉంటామని మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో మధ్యస్థ స్థాయి మేనేజ్మెంట్ ఉద్యోగులపై అధిక ప్రభావం పడనుందని తెలుస్తోంది.