Thursday, June 19, 2025
E-PAPER
Homeఎడిట్ పేజినోటితో నవ్వి…

నోటితో నవ్వి…

- Advertisement -

ఇండియా తరహాలో ఒకే జట్టులా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తే అసాధ్యమైన లక్ష్యమేదీ ఉండదని మొన్న నిటి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటలు ‘నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం’ అన్న సామెతను గుర్తు చేస్తున్నాయి. విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాల పాలనను గవర్నర్ల ద్వారా స్తంభింజేయడం మొదలు ఇటీవలి పహల్గాం ఉగ్ర దాడి, అనంతర భారత్‌ పాక్‌ సాయుధ ఘర్షణ గురించి పాలక కూటమి ముఖ్యమంత్రులకు, నాయకులకు మాత్రమే ఆదివారంనాడు వివరించుకున్న ప్రధానమంత్రి నిటి ఆయోగ్‌ సమావేశంలో మాత్రం గంభీర ఉపన్యాసం చేయడం ఆయనకే చెల్లింది. ప్రజలెన్నుకున్న చట్టసభలు ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్లు నిర్దిష్ట కాలపరిమితిలోగా తమ సమ్మతి తెలపాల్సిందేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునే రాష్ట్రపతి ద్వారా ప్రశ్నించిన కేంద్ర ప్రభుత్వానికి అధినేత ఆయన! ఇలా చెబుతూపోతే రాష్ట్రాల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి కొండవీటి చేంతాడంత జాబితా అవుతుంది. ఇదే ‘సహకార ఫెడరలిజం’ అని లోకమంతా అనుకోవాలా? పహల్గాం ఉగ్రదాడి, తదనంతర ఆపరేషన్‌ సిందూర్‌తోపాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ను, ఉగ్రవాదాన్ని ఒంటరిపాటు చేయడానికి వివిధ పార్టీల నేతలను దేశదేశాల్లో తిప్పుతున్న మోడీ సర్కారు ఈ దేశ ప్రజలకు వివరించడానికి అత్యున్నత ప్రజాస్వామిక వేదికయైన పార్లమెంటును మాత్రం సమావేశపర్చడం లేదు. ఇదీ పాలకుల పారదర్శకత!
నిటి ఆయోగ్‌ సమావేశం మరుసటి రోజునే పాలక కూటమి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్య మంత్రుల సమావేశం ఆపరేషన్‌ సిందూర్‌లో భారత సాయుధ దళాల అసమాన ధైర్య సాహసాలను కొనియాడుతూ తీర్మానించింది. పనిలోపనిగా ప్రధాని నరేంద్ర మోడీకి స్తోత్రపాఠాలతో సమావేశం వెల్లువెత్తింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌, పందొమ్మిది రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరిగినట్టు చెబుతున్నా ఆపరేషన్‌ సిందూర్‌, దేశ భద్రత సహా పలు అంశాలపైనే ప్రధాన చర్చ నడిచిందన్నది వాస్తవం. ఆపరేషన్‌ సిందూర్‌ విజయంలో సాయుధ బలగాలు ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలను, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఉగ్రవాదులకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఆపరేషన్‌ సిందూర్‌ గట్టి సమాధానం ఇచ్చిందని పేర్కొనడం బాగానే ఉంది. కానీ ఇంత ప్రతిష్టాత్మక ఆపరేషన్‌ నిర్వహించిన తరువాత కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారనీ, భారత్‌ పాక్‌ ద్వైపా క్షిక వివాదంలో మూడోవారు ఎందుకు జోక్యం చేసుకున్నారన్నది మాత్రం వెల్లడించ లేదు. నరేంద్ర మోడీని లేదా అమిత్‌షాను ప్రశ్నించే సాహసం ఎన్డీయే భాగస్వాము లెవరూ చేయలేకపోవచ్చు కానీ వాస్తవాలు తెలియ జెప్పాల్సిన బాధ్యత కూటమి నాయకత్వానిదే కదా! మిత్ర ధర్మాన్ని సైతం బీజేపీ విస్మరించినట్టే భావించవలసి వస్తుంది. లేదు.. అని ఎవరైనా అంటే ట్రంప్‌ జోక్యంపై ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి.
టీం ఇండియా స్ఫూర్తితో పని చేయాలన్న ఆకాంక్ష వాస్తవమైతే కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటు సమావేశం జరిపి అన్ని విషయాలను వెల్లడించాలి. పారదర్శకంగా ప్రజ లకు అన్నీ తెలియజేస్తేనే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతీ యులందరినీ ఐక్యంగా నిలపడం సాధ్యమవుతుంది. నిజానికి పహల్గాం ఉగ్రదాడి జరిగిన వెనువెంటనే బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో కాశ్మీర్‌ ప్రజలు- వారిలో అత్యధికులు ముస్లింలు- చూపిన స్ఫూర్తి ఆదర్శవంతమైనది. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు యావద్భారతావని ఏకతాటిపై ఉగ్ర వాదానికి, వారిని ప్రోత్సహించేవారికీ వ్యతిరేకంగా నిలిచింది. ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా మధ్యప్రదేశ్‌ మంత్రి, ఉప ముఖ్య మంత్రి, తాజాగా బీజేపీ ఎంపీ రామచంద్ర జాంగ్రా వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. సాక్షాత్తూ సుప్రీం కోర్టు తలంటినా బీజేపీ అధిష్టానం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం ఏ సంకేతాలనిస్తుంది? పాలకులు తగు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం అవశ్యం!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -