38 మంది మృతి
వాషింగ్టన్ : అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుపాను ప్రభావంతో భారీగా మంచు కురువడం, గడ్డకట్టే ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఈ తుపాను కారణంగా అమెరికాలోని 14 రాష్ట్రాల్లో 38 మంది మృతి చెందారు. ఈ నెల 23 నుంచి మంచు తుపాను అమెరికాలో తన ప్రభావాన్ని చూపిస్తోంది. భారీగా కురుస్తున్న మంచుతో రాకపోకలు స్థంభించిపో యాయి. భారీ సంఖ్యలో విమానసర్వీసులు రద్దు చేశారు. విద్యుత్కు, మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనేక ఇళ్లు మంచులో కూరుకునిపోయాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. టెన్నెస్సీలోని నాష్విల్లేలో సుమారు 7 లక్షల జనాభా ఉండగా, వీరిలో రెండు లక్షల మంది నిరాశ్రయులయ్యారని అంచనా. న్యూయార్క్ నగరంలోనే పది మంది మరణించారు.
టెక్సాస్లో ముగ్గురు మంచు చెరువులో పడి మరణించారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు అధికారులు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది విరామం లేకుండా పని చేస్తున్నారు. ఫిబ్రవరి 1 వరకూ మంచు తుపాను ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మంచు తుపాను గురించి న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ మాట్లాడుతూ నగరంలో గత ఎనిమిదేళ్లలో ఎన్నడూలేనంతగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు. ఈ నెల 19 నుంచే 5 వేల మందికి పైగా నిరాశ్రయలకు ఆశ్రయం కల్పిస్తున్నామని చెప్పారు. భోజనం, దుస్తులు, అవసరమైన ఔషధాలు సమకూరుస్తున్నట్లు తెలిపారు.



