నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలు రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లపైకి వరద నీరు చేరడంతో, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. మరికొన్ని సర్వీసులను పాక్షికంగా నిలిపివేయడంతో పాటు, ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించింది.
రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కామారెడ్డి-బికనూర్-తలమడ్ల, అకనపేట్-మెదక్ సెక్షన్ల మధ్య రైల్వే ట్రాక్పై వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగా బుధవారం నడిచే కరీంనగర్-కాచిగూడ, కాచిగూడ-నిజామాబాద్, కాచిగూడ-మెదక్, మెదక్-కాచిగూడ, బోధన్-కాచిగూడ, ఆదిలాబాద్-తిరుపతి రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. వీటితో పాటు గురువారం నడవాల్సిన నిజామాబాద్-కాచిగూడ సర్వీసును కూడా రద్దు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా, మహబూబ్నగర్-కాచిగూడ, షాద్నగర్-కాచిగూడ రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వర్షాల తీవ్రత కొనసాగుతున్నందున, రద్దయ్యే లేదా దారి మళ్లే రైళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలు తెలుసుకునేందుకు, రైల్వే శాఖ ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది.
సమాచారం కోసం సంప్రదించాల్సిన నంబర్లు
కాచిగూడ: 9063318082
నిజామాబాద్: 970329671
కామారెడ్డి: 9281035664
సికింద్రాబాద్: 040-27786170