45 రోజుల నిరంతర నిఘా
రాత్రీ పగలు అక్కడే మకాం..
జాతర విజయవంతంలో పోలీస్ కీలక పాత్ర
కోట్ల మంది వచ్చినా.. ఏ ఇబ్బందీ లేకుండా చర్యలు
అత్యాధునిక డ్రోన్ వ్యవస్థ – అడుగడుగునా పోలీస్
నవతెలంగాణ – ములుగు
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విజయవంతానికి ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ నేతృత్వంలో పోలీస్ విభాగం అసాధారణ సమన్వయంతో పనిచేసింది. మొత్తం పోలిస్ సిబ్బందిని ఒక తాటి మీదికి తీసుకొచ్చి జాతరను సజావుగా, భద్రంగా నిర్వహించిన తీరు ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. కోట్లాది మంది సందర్వకులు తరలివచ్చిన ఈ మహాజాతరలో ఎస్పీ కేకన్ పర్యవేక్షణలో సుమారు 13,000 మంది పోలిస్ సిబ్బంది పాల్గొనగా.. 10 మంది సీనియర్ ఐపీఎస్, 20మంది ఇతర ఐపీఎస్ అధికారులు, 25మంది అదనపు ఎస్పీలు, 65మంది వరకు డీఎస్పీలు, 300వరకు సీఐలు, 500 వరకు ఎస్ఐలు, మిగతా పోలీస్ సిబ్బంది తెలంగాణ అన్ని జిల్లాల నుంచి బందోబస్తులో పాల్గొన్నారు. రాష్ట్ర డీజీపీ పర్యవేక్షణలో మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి బందోబస్తు ఇన్చార్జీగా, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ట్రాఫిక్ ఇన్చార్జీగా, అంబర్కిషోర్ ఝా కమాండ్ కంట్రోల్ ఇన్చార్జీగా కీలక పాత్ర పోషించారు. యువ ఐపీఎస్ అధికారులు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు సమిష్టిగా పనిచేశారు.
తెలంగాణ ఇంటెలిజెన్స్ సహకారంతో దేశంలోనే తొలిసారిగా డ్రోన్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అత్యాధునిక డ్రోన్ వ్యవస్థ, క్రౌడ్ డెన్సిటీ మానిటరింగ్, తప్పిపోయిన పిల్లలను గుర్తించే సాంకేతికత అమలు చేశారు. 450కి పైగా సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలు(ఏఎన్పిఆర్), 2000 ఎకరాల్లో 40 పార్కింగ్ స్థలాలు, సుమారు 750 మంది పోలీసులతో సీఎస్ఎస్ టీం ఏర్పాటు, 1500 మంది మహిళా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. మేడారం జాతరలో కీలక గట్టాలైన పార్కింగ్ ట్రాఫిక్ విజయవంతం చేయడమెంది. కోట్ల మంది భక్తులు వచ్చే ఈ జాతరలో తల్లుల ఊరేగింపును చూసేందుకు అమ్మవార్లను తాకేందుకు లక్షల్లో ప్రయత్నిస్తారు, అయినా కేవలం 300మంది పోలీసు బలగంతో రోప్ పార్టీ ద్వారా పక్కా ప్రణాళికతో అమ్మవార్లను భద్రంగా గద్దెలకు చేర్చారు. సందర్శకులకు సురక్షితంగా అమ్మ వార్ల దర్శనం చేయించి తిరిగి ఇండ్లకు చేర్చడంలో పోలీసులు సఫలీకృతమయ్యారు. పోలీస్ విభాగం అంకితభావంతో మేడారం జాతర మరోసారి విజయవంతంగా ముగిసింది.
మేడారం జాతరలో ఎస్పీ కేకన్ మార్క్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



