Thursday, March 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజీహెచ్‌ఎంసీ తరహాలో ఎస్పీడీసీఎల్‌..!

జీహెచ్‌ఎంసీ తరహాలో ఎస్పీడీసీఎల్‌..!

- Advertisement -

– జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్‌గా మూడు విద్యుత్‌ సర్కిళ్లు
– నెలాఖరులోగా పూర్తి
– ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి..!
– గ్రేటర్‌ విభజనకు అనుగుణంగా కొనసాగుతున్న కసరత్తు
నవతెలంగాణ-సిటీబ్యూరో

గ్రేటర్‌లో జీహెచ్‌ఎంసీ తరహాలోనే పాలన అందించ డానికి ఎస్పీడీసీఎల్‌ సిద్ధమవుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లుగా విడిపోతుం డటంతో.. అందుకు అనుగుణంగానే దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌) కూడా తన పరిపాలనా యంత్రాంగం లో మార్పులు, చేర్పులు చేసే దశగా అడుగులు వేస్తోంది. ట్రై కమిషనరేట్లతోపాటే ఈ ప్రక్రియ కూడా పూర్తి కానుండగా.. ఇప్పటికే అధికార యంత్రాంగం ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

సర్కిళ్లలో మార్పులు, చేర్పులు
ప్రస్తుతం విద్యుత్‌ సర్కిళ్లు పాత గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిని బట్టి విస్తరించాయి. ఇటీవల నగరం గ్రేటర్‌ హైదరా బాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్లుగా విడిపోవడంతో, ఇందుకు అనుగుణంగా సర్కిళ్ల వారీగా మార్పులు, చేర్పులు చేసేందుకు ఎస్పీడీసీఎల్‌ సిద్ధమవు తోంది. మున్సిపాలిటీల సరిహద్దులకు లోబడే ఈ విద్యుత్‌ సర్కిళ్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. కొత్త ప్రక్రియ ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధి అలాగే కొనసాగు తుండగా.. నూతనంగా ఏర్పాటైన సైబరాబాద్‌, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోకి వచ్చే విద్యుత్‌ సెక్షన్లు, సబ్‌ డివిజన్లను ఆయా కొత్త కార్పొరేషన్ల పరిధిలో చేర్చనున్నారు. ఈ విభజన ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తి చేసి, ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి తీసుకురావాలనే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఏ కార్పొరేషన్‌ పరిధిలోకి ఏ సర్కిల్‌ వెళ్లాలి..? ఏ కార్పొరేషన్‌లో ఏయే డివిజన్లను విలీనం చేయాలి..? అనే అంశాలపై సంబంధిత ఉన్నతాధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయితే మరో 15 రోజుల్లో ఈ పునర్‌వ్యవస్థీకరించిన సర్కిళ్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో ప్రజలకు బిల్లింగ్‌ సమస్యలు తగ్గడంతో పాటు, స్థానిక మున్సిపల్‌ అధికారుల తో కలిసి లైన్ల మార్పిడి, పోల్‌ షిఫ్టింగ్‌ వంటి అభివృద్ధి పనులకు ఎలాంటి అవాంతరాలూ జరగకుండా, త్వరి తగతిన, వేగంగా పూర్తి చేసే అవకాశం కూడా ఉంటుంది.

సమన్వయం సులభతరం
మూడు కార్పొరేషన్లకు అనుగుణంగా విద్యుత్‌ సర్కిళ్ల మార్పుతో సేవను త్వరితగతిన అందించేందుకు ఎస్పీ డీసీఎల్‌ సిద్ధమవుతోంది. విద్యుత్‌ సమస్యలకు మరింత వేగంగా పరిష్కారం దొరుకనుంది. మున్సిపల్‌ రోడ్ల విస్తరణ, డ్రయినేజీ పనుల సమయంలో విద్యుత్‌ లైన్ల మార్పిడికి సంబంధిత కార్పొరేషన్‌ అధికారులతో సమన్వయం సులభతరం కానుంది. పరిధి తగ్గడంతో అధికారులు క్షేత్ర స్థాయిలో మెరుగైన పర్యవేక్షణ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ పునర్‌వ్యవస్థీకరణ విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.

కొత్త జోన్ల వారీగా సర్కిళ్లు..
గతంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పరిపాలనా సౌలభ్యం కోసం ఎస్పీడీసీఎల్‌ను నాలుగు జోన్లు, 12 సర్కిళ్లుగా విభజించారు. ఇటీవల నగరం మూడుగా విడిపోవడం తో పాలనా సౌలభ్యం కోసం విద్యుత్‌ సర్కిళ్లను కూడా మార్చాల్సి వస్తోంది. కొత్త జోన్ల ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధి లో ఓల్డ్‌ సిటీతోపాటు మెట్రో, సెంట్రల్‌ సిటీ జోన్లను కలిగి ఉంది. ఇందులో సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, చార్మినార్‌, గోల్కొండ, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ సర్కిళ్లు ఉంటాయి. సైబరాబాద్‌ మున్నిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి ఐటీ కారి డార్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ సర్కిళ్లు వస్తాయి. ఇక మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి మల్కాజిగిరి, ఉప్పల్‌, ఎల్బీనగర్‌ సర్కిళ్లు ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -