Wednesday, November 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు

- Advertisement -

– నేడు, రేపు విచారణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ నోటీసులు జారీ చేశారు. బుధ, గురువారాల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. బుధవారం తెల్లం వెంకట్రావు, డాక్డర్‌ సంజరు, 20న పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీలను స్పీకర్‌ విచారించనున్నారు. వీరి తరపున న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. ఆ తర్వాత పిటిషనర్ల తరపు న్యాయవాదులు క్రాస్‌ ఎగ్జామిన్‌ చేస్తారు. సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లల్లో వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో మూడు నెలల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన విషయం విదితమే. అయితే స్పీకర్‌ ఇప్పటికే కొంతమందిని విచారించారు. అయితే శాసనసభా వ్యవహారాలకు సంబంధించి విదేశీ పర్యటన దాదాపు మూడు వారాలు జరిగింది. దీంతో విచారణకు సమయం చిక్కలేదని అసెంబ్లీ వర్గాలు అంటున్నాయి. 19,20 తేదీలకు సంబంధించి విదేశీ పర్యటనకు ముందే షెడ్యూల్‌ ఇచ్చారు. సుప్రీం ఆదేశాల అనంతరం ఫిరాయింపు శాసనసభ్యులకు మళ్లీ నోటీసులు జారీశారు. పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై త్వరలో వెలువడే అవకాశం లేకపోలేదు. స్పీకర్‌ నిర్ణయం వెలువరించకపోవడం పూర్తిగా కోర్టు ధిక్కారం పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవారు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై విచారణ పూర్తిచేసి మూడు వారాల క్రితమే తీర్పు రిజర్వ్‌ చేసిన విషయం విదితమే. మరో నలుగురిపై సాక్ష్యాలు నమోదు చేసిన వాదనలు వినిపించడానికి వాయిదా తేదీని ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కేటీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే విచారణ పూర్తిచేయడానికి తాము ఎనిమిది వారాల సమయం మాత్రమే అడిగినట్టు అసెంబ్లీ కార్యదర్శి తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ చెప్పారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం రోజువారీ విచారణ చేయాలని ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -