Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి 

గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి 

- Advertisement -

– ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ తిరుమల ప్రసాద్ 
– మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
తరచు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ తిరుమల ప్రసాద్ అన్నారు. ఆయా పథకాలలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని మండల స్థాయి అధికారులకు సూచించారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో మండలంలో వివిధ పథకాల అమలు తీరుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

పారిశుద్ధ్య లోపం ఉంటే దోమలు వృద్ధి చెంది ప్రజలు విష జ్వరాల బారిన పడతారన్నారు.ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా దోమల నివారణ చర్యల్లో భాగంగా మురికి కాలువలు, నీటి నిల్వ గుంతలు, తదితర ప్రాంతాల్లో గ్రామపంచాయతీ సిబ్బందితో  బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, ఆయిల్ బాల్స్ వేయించాలని సూచించారు.మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటివరకు నమోదైన డెంగ్యూ, చికెన్ గున్యా, తదితర కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశాఖ సిబ్బంది  మంగళవారం, శుక్రవారం డ్రైడే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా దోమల వృద్ధి వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మండలంలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై, గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనితీరును ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచేలా లబ్ధిదారులకు, సంబంధిత మేస్త్రీలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మండలంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహణ తీరుపై సమీక్షించారు.వన మహోత్సవంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. ఇప్పటికే సేకరించిన స్థలాల్లో మొక్కలు నాటించి వాటి సంరక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, మండల వైద్యాధికారి, కమ్మర్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ నరసింహ స్వామి, చౌటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ స్పందన, హౌసింగ్ ఏఈ రాకేష్, మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారిని గంగమణి, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -