నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని సంక్షేమ హాస్టళ్లపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ బంజారాహిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్లో వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
పూర్తి స్థాయి డేటాతో సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థలో అకౌంటబిలిటీ ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. హాస్టళ్లలో విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని పూర్తిగా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు అందించే భోజనం క్వాలిటీ చెక్కు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని తెలిపారు. విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోలన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు అందించే దుస్తులు, పుస్తకాలు వారికి చేరుతున్నాయో లేదో ధృవీకరించాలని పేర్కొన్నారు.
మౌలిక వసతులకు సంబంధించి ప్రతి హాస్టల్లో పరిస్థితులపై పూర్తి స్థాయి డేటాను అప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానం అనుసరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ భేటీలో పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.