రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు- ఎన్నికల అధికారులు, ఈ ఆర్ ఓ లతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారిగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు.
ఇందులో కేటగిరీ A లో 1987 కంటే ముందు జన్మించి 2002, 2025 ఎలక్టోరల్ జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ B లో 1987 కంటే ముందు జన్మించి 2002 ఓటరు జాబితాలో లేకుండా 2025 జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ C లో 1987 నుంచి 2002 మద్యలో జన్మించి 2025 ఓటరు జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ D లో 2002-2007 మధ్యలో జన్మించిన వారిగా విభజించడం జరిగిందని తెలిపారు. అన్ని కేటగిరీలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల 33 లక్షల ఓటర్లను మ్యాపింగ్ చేయడం జరిగిందని తెలిపారు. మొదట మ్యాపింగ్ చేయబడిన కేటగిరి A జాబితాను బి ఎల్ ఓ యాప్ ద్వారా నిర్ధారించుకోవాలని, తద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టల్ లో నమోదు చేయబడుతుందని తెలిపారు. అనంతరం కేటగిరి C, క్యాటగిరి D లలోని ఓటర్లను కేటగిరి A కు మ్యాపింగ్ చేయాలని, ఈ ప్రక్రియను ఎ ఈ ఆర్ఆ ఓ ల ఆధ్వర్యంలో బి ఎల్ ఓ సూపర్ వైజర్లు, బి ఎల్ ఓ లు బి ఎల్ ఓ యాప్ ద్వారా వచ్చే శనివారం నాటికి పూర్తి చేయాలని తెలిపారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.యం. సంతోష్ మాట్లాడుతూ, బి ఎల్ ఓ లు, ఎల్ ఓ సూపర్ వైజర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, మొదట కేటగిరి A ఓటరు జాబితాను బిఎల్ఓ యాప్ ద్వారా నిర్ధారించిన తర్వాత కేటగిరి C, D లను కేటగిరి A కు లింక్ చేయడం జరుగుతుందని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ అలివేలు, తహసిల్దార్ మల్లికార్జున్, ఎన్నికల విభాగం అధికారి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.



