Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పొరపాట్లు లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలి

పొరపాట్లు లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలి

- Advertisement -

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 

ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈ ఆర్ ఓ లతో  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ, 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు.

ఇందులో కేటగిరీ “ఎ” లో 1987 కంటే ముందు జన్మించి 2002, 2025 ఎలక్టోరల్ జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ “బి” లో 1987 కంటే ముందు జన్మించి 2002 ఓటరు జాబితాలో లేకుండా 2025 జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ “సి” లో 1987 నుంచి 2002 మద్యలో జన్మించి 2025 ఓటరు జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ “డి” లో 2002-2007 మధ్యలో జన్మించిన వారిగా విభజించడం జరిగిందని తెలిపారు.

అన్ని కేటగిరీలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల 33 లక్షల ఓటర్లను మ్యాపింగ్ చేయడం జరిగిందని తెలిపారు. మొదట మ్యాపింగ్ చేయబడిన కేటగిరి “ఎ” జాబితాను బి.ఎల్.ఓ యాప్ ద్వారా నిర్ధారించుకోవాలని, తద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టల్ లో నమోదు చేయబడుతుందని తెలిపారు. అనంతరం కేటగిరి సి, కేటగిరి డి లలోని ఓటర్లను కేటగిరి “ఎ” కు మ్యాపింగ్ చేయాలని, ఈ ప్రక్రియను ఎ.ఈ.ఆర్.ఓ ల ఆధ్వర్యంలో బిఎల్ఓ సూపర్ వైజర్లు, బిఎల్ఓ లు బి ఎల్ ఓ యాప్ ద్వారా వచ్చే శనివారం నాటికి పూర్తి చేయాలని తెలిపారు.

 జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, బిఎల్ఓ లు, బి ఎల్ ఓ సూపర్ వైజర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, మొదట కేటగిరి ఎ ఓటరు జాబితాను బిఎల్ఓ యాప్ ద్వారా నిర్ధారించిన తర్వాత కేటగిరి సి, డి లను కేటగిరి ఎ కు లింక్ చేయడం జరుగుతుందని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, దశలవారీగా పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 50 శాతం మ్యాపింగ్ పూర్తయ్యిందని అన్నారు. ప్రతి రోజూ ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -