– 216 మందికి వైద్య సేవలు
– ప్రజలు వినియోగించుకోవాలని పిలుపు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వం చేపట్టిన వందరోజుల ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా వినాయకపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సోమవారం స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వినాయకపురం పంచాయతీ ఉపసర్పంచ్ జగదీశ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్పెషలిస్ట్ వైద్యులను గ్రామాలకు పంపిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందాలని కోరారు.
పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రాందాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి మొత్తం 216 మంది వివిధ ఆరోగ్య సమస్యలతో హాజరయ్యారు.వారిలో 43 మంది గర్భిణులు, 33 మంది చిన్నపిల్లలు, 28 మంది కీళ్ల సంబంధ వ్యాధులతో, 26 మంది కంటి సమస్యలతో, 20 మంది పంటి సమస్యలతో మరియు 66 మంది సాధారణ వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు.
ఈ వైద్య శిబిరంలో డాక్టర్ రాందాస్ తో పాటు డాక్టర్ సాగరిక, డాక్టర్ జమీమా, డాక్టర్ సాయి రచన, డాక్టర్ సంతోష్, డాక్టర్ సృజన్, డాక్టర్ మౌనిక పాల్గొని వైద్య సేవలు అందించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు.



